నిన్న మోడీ..నేడు అమిత్ షా: దీదీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా?
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండురోజులుగా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. తీరిక లేకుండా గడుపుతున్నారు. తన తొలిరోజు పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయిన ఆమె.. రెండో రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆమె తమ రాష్ట్రం ఎదుర్కొంటోన్న పలు అంశాలను వారిద్దరి దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును బంగాల్గా మార్చాలనేది ఆమె ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ ను ఆమె ప్రధానిని వినిపించారు. వినతిపత్రం రూపంలో ఆయనకు దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా తమ రాష్ట్రం పేరును బంగాల్ గా మార్చాలని కోరారు. గురువారం ఉదయం ఆమె అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా రెండోసారి ఏర్పాటైన తరువాత మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.
ఇష్టానుసారంగా ఫీజులు చెల్లవిక: ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు: ఛైర్మన్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి
ఎన్ఆర్సీప పట్ల మమతా అభ్యంతరం
దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ ధృవీకరణ (ఎన్ఆర్సీ) విధానాన్ని అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం పట్ల మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యాత్మక, అతి సున్నితమైన రాష్ట్రాల్లో ఎన్ఆర్సీని అమలు చేయడం వల్ల పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ.. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలనుకోవడం అవివేకమని మమతా బెనర్జీ ఇదివరకే విమర్శించారు. తాజాగా- అమిత్ షాను సమక్షంలో కూడా ఆమె ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఎన్ఆర్సీని అమలు చేయడం వల్ల దేశ ప్రజల్లో అభద్రతా భావం వ్యక్తమౌతుందని అన్నారు. ఎన్ఆర్సీ విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించిన తరువాత సుమారు 19 లక్షల మందికి పైగా ప్రజలు ధృవీకరణకు నోచుకోలేదని అన్నారు. వారిలో హిందీ, బెంగాళీ, అస్సామీ భాషలను మాట్లాడే వారు ఉన్నారని చెప్పారు. వారంతా పుట్టుకతో భారతీయులేనని చెప్పారు.
ఓటు బ్యాంకుతో ముడిపెట్టి..
అమిత్ షాతో సమావేశం ముగిసిన అనంతరం.. మమతా బెనర్జీ విలేకరులతో మాట్లాడారు. ఎన్ఆర్సీ విధానాన్ని తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాననే విషయాన్ని వివరించారు. ఇన్ని లక్షల మంది జాతీయ పౌరసత్వ ధృవీకరణకు నోచుకోకపోవడం ఆందోళనకరమని అన్నారు. ఎన్ఆర్సీని అడ్డు పెట్టుకుని చాలామంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని చెప్పారు. దీని ప్రభావం..
అభ్యర్థులు, పార్టీల గెలుపోటములపై తీవ్రంగా పడుతుందని అన్నారు. ఎన్ఆర్సీపై తన అభ్యంతరాలన్నింటినీ తెలియజేస్తూ అమిత్ షానకు ఓ వినతిపత్రాన్ని అందజేశానని మమతా బెనర్జీ తెలిపారు. భవిష్యత్తులో రాజకీయ కోణంలో దీన్ని చూడాల్సిన పరిస్థితిని కేంద్రమే కల్పించినట్టవుతుందని అన్నారు. సంప్రదాయబద్ధమైన ఓటుబ్యాంకును లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం.. ఎన్ఆర్సీ ద్వారా తమకు వ్యతిరేకంగా ఉండే ఓటర్లను జాబితా నుంచి తొలగించే చర్యలకు పూనుకునే ప్రమాదం లేకపోలేదని అన్నారు.