సోనియా ఫ్యామిలీకి కేంద్రం షాక్: రాజీవ్, ఇతర ట్రస్టులకు చైనా నిధులపై ప్రత్యేక కమిటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబానికి కేంద్రం భారీ షాకిచ్చింది. సోనియా గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్ ట్రస్ట్లపై విచారణకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

రాజీవ్ గాంధీ ట్రస్టులకు చైనా నిధులపై ప్రత్యేక కమిటీ..
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్లు ఐటీ శాఖ చట్టం, పీఎంఎల్ఏ, ఎఫ్సీఆర్ఏ వంటి చట్టాలనుఉల్లంఘించాయని ఆరోపణలున్నాయి. వాటికి చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సదరు ట్రస్టుల అక్రమ లావాదేవీలపై విచారణకు అంతర్ మంత్రిత్వ కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పెషల్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తున్నారు.

మోడీ క్లారిటీ ఇచ్చినా ఆగని సోనియా, రాహుల్ విమర్శలు
భారత్-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్రం, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎడతెరిపిలేకుండా విమర్శలు చేస్తున్నారు. భారత భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదని, ఒక్క అడుగు కూడా భారత్ కోల్పోయేందుకు సిద్దంగా లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేసినప్పటికీ ఈ కాంగ్రెస్ నేతలు తమ ఆరోపణలను కొనసాగిస్తుండటం గమనార్హం.

చైనాకు కాంగ్రెస్ పెద్దలు అనుకూలం అందుకే..: బీజేపీ
బీజేపీ నేతలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. చైనాతో రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు సంబంధాలున్నాయని, చైనా ఎంబసీ నుంచి ఆ ఫౌండేషన్కు భారీ మొత్తంలో నిధులు అందుతున్నాయని కేంద్రమంత్రి రవిశంకర్ సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.
ఇటీవలే రూ. 90 లక్షల మేర నిధులు వచ్చాయన్నారు. అందుకే కాంగ్రెస్ పెద్దలు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
అయితే, బీజేపీ ఆరోపణలపై ఏ కాంగ్రెస్ నేత కూడా స్పందించకపోవడం గమనార్హం. ఇక, ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా చర్యలకు ఉపక్రమించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications