M777 Howitzers కోసం అమెరికా నుంచి మందుగుండు సామాగ్రి: ఆర్డర్ రెడీ
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఘర్షణల నేపథ్యంలో భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. తాజాగా, అమెరికా నుంచి ఎం-777 హౌవిట్జర్ గన్స్ కోసం భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఆర్డర్ సిద్ధం చేసింది. భారత భద్రతా దళాలకు రూ. 500 కోట్ల నిధిని కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్డర్ చేయడం గమనార్హం.

అమెరికా నుంచి రెండోసారి మందుగుండు సామాగ్రి కొనుగోలు..
ఎం-777 గన్స్ కోసం మందుగుండు సామాగ్రిని అమెరికా నుంచి ఆర్డర్ చేస్తున్నామని రక్షణ వర్గాలు తెలిపాయి. ఈశాన్య లడఖ్ ప్రాంతానికి వీటిని తరలిస్తున్నామని వెల్లడించింది. యుద్ధ సామాగ్రిని, ఆయుధాలను పెంచుతున్నట్లు తెలిపింది. కాగా, బాలాకోట్ ఆపరేషన్స్ తర్వాత గత సంవత్సరం మే-జూన్ మధ్య కాలంలో తొలిసారి ఈ మందుగుండు సామాగ్రిని ఆర్డర్ చేసింది. ఈ మందుగుండు సామాగ్రిని ఉపయోగించి ఫిరంగి తుపాకుల ద్వారా సుమారు 40-50 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదిస్తామని ఆర్మీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రూ. 500 కోట్ల నిధి నుంచే..
సరిహద్దులో చైనాతో ఘర్షణల నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం త్రివిధ దళాలకు రూ. 500 కోట్ల నిధిని ఏర్పాటు చేసింది. ఈ మొత్తంతో అవసరమైన ఆధునాతన ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసేందుకు, ఉన్న ఆయుధాలను అప్గ్రేడ్ చేసుకునేందుకు భద్రతా దళాలకు అనుమతిచ్చింది.
ఈ క్రమంలోనే అమెరికా నుంచి మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

సరిహద్దుకు వెళ్లిన ఆర్మీ చీఫ్..
ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే లడఖ్ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ విధులు నిర్వహిస్తున్న కమాండర్లతో చర్చలు జరిపారు. సరిహద్దులో పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో వారి సూచనల మేరకు ఫిరంగి తుపాకుల మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా కూడా సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు.

చైనాపై ఆగ్రహజ్వాలలు
జూన్ 15న చైనా దళాలు భారత సైనికులపై దొంగదారిన వచ్చి దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో చైనాపై భారత రక్షణ దళాలతోపాటు దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాకు తగిన గుణపాఠం చెప్పాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఉత్పత్తుల నిషేధానికి దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా చైనాతో పలు ప్రాజెక్టులను రద్దు చేసుకుంది.












Click it and Unblock the Notifications