సరిహద్దుల్లో ఇంకా వేలమంది చైనా సైనికులు: ఉపసంహరణకు బ్రేక్: మళ్లీ ఉద్రిక్తత
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో చల్లారేలా కనిపించట్లేదు. సరిహద్దులను ఖాళీ చేస్తున్నట్లు కనిపించిన చైనా.. తన సైనిక బలగాలను సరిహద్దుల్లో ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సుమారు 40 వేల మంది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖ వెబండి కొనసాగుతున్నారు. ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. కనీసం 40 వేల మంది చైనా సైనికులు సరిహద్దుల్లో ఇప్పటికీ మోహరించే ఉన్నారనే విషయాన్ని వారు నిర్ధారించారు.
Recommended Video
లఢక్ సరిహద్దు ఘర్షణల్లో 5 మంది చైనా సైనికులు మృతి: మీడియా కథనాలపై నోరువిప్పని డ్రాగన్
భారత్, చైనా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి రెండు దేశాల మధ్య ఇప్పటికే రక్షణ, దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. తొలి విడత దౌత్య చర్చలు ముగిసిన తరువాత చైనా వాస్తవాధీన రేఖ ప్రాంతాన్ని ఖాళీ చేయడం ప్రారంభించింది. వాస్తవాధీన రేఖ నుంచి రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లింది. ఈ విషయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్యీ మధ్య చర్చల అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది.
అప్పటి నుంచి దశలవారీగా సరిహద్దుల నుంచి చైనా బలగాల ఉపసంహరణ కొనసాగుతోందని భావిస్తూ వచ్చారు ఇన్నిరోజులు. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. తాజాగా సరిహద్దుల్లో నెలకొన్న పరిణామాలను బట్టి చూస్తే.. చైనా తన సైన్యాన్ని ఉపసంహరించే ప్రక్రియను నిలిపివేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికీ 40 వేల మంది చైనా పీఎల్ఏ బలగాలు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నారని స్పష్టం చేస్తున్నారు.
గాల్వన్ వ్యాలీ, ఫింగర్స్ ఏరియా, పెట్రోలింగ్ పాయింట్ 17, పెట్రోలింగ్ పాయింట్ 17 ఏ, ఫింగర్ 4, ఫింగర్ 5 వంటి ప్రాంతాల నుంచి చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవడం ప్రారంభించినప్పటికీ.. పంగ్యాంగ్ త్సో, డెప్సాంగ్లల్లో సైన్యాన్ని యధాతథంగా కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్, చైనా మధ్య మరో విడత చర్చలు ప్రారంభం కాబోయే అవకాశాలు ఉన్నట్లు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. రక్షణపరంగా లెప్టినెంట్ కమాండర్ స్థాయి అధికారులతో చర్చలను కొనసాగిస్తూనే.. మరోవంక దౌత్యపరంగా తమవంతు ప్రయత్నాలను కొనసాగిస్తోంది భారత్.