చైనా సరిహద్దులే టార్గెట్: అనుక్షణం అప్రమత్తం.. నిఘా ముమ్మరం: ఆర్మీ కొత్త చీఫ్ కీలక వ్యాఖ్యలు..!
Recommended Video
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల విషయంలో భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తాము అన్ని చర్యలను తీసుకుంటున్నామని నూతన సైనికాధిపతి మనోజ్ ముకుంద్ నరావణే వెల్లడించారు. చైనాతో సరిహద్దు పొడవునా నిఘాను మరింత ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలతో సమానంగా చైనా పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.
సైనిక దళాధిపతిగా బాధ్యతలను స్వీకరించిన ఆయనకు బుధవారం ఉదయం న్యూఢిల్లీలో సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన ప్రాధాన్యతలను వివరించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తూర్పు, ఈశాన్య ప్రాంతాల సరిహద్దులతో సమానంగా పశ్చిమ దిశగా సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పొరుగు దేశాల నుంచి ఎలాంటి ప్రమాదాలు ఎదురైనా, సమర్థవంతంగా తిప్పికొట్టే దిశగా సరిహద్దు జవాన్లను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు. చైనాతో సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికే తాము ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. చైనాతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉందని, చర్చలు, శాంతియుత వాతావరణం ద్వారానే అది సాధ్యపడుతుందనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు.
చైనాతో సరిహద్దు వివాదాలను పరిష్కరించడంలో నిష్ణాతుడిగా మనోజ్ ముకుంద్ నరావణేకు పేరున్న విషయం తెలిసిందే. అందుకే ఆయన తన తొలి ప్రాధాన్యతను పాకిస్తాన్ కంటే చైనాకే ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పాకిస్తాన్ తో ఏర్పడిన యుద్ధ పూరక వాతావరణం.. సరిహద్దులకు మాత్రమే పరిమితమైనది కాదని, దాన్ని పరిష్కరించడానికి రాజకీయ జోక్యం అవసరమనే వాదనలు లేకపోలేదు.
పాకిస్తాన్ తో పోల్చుకుంటే చైనా సరిహద్దు వివాదాలు పూర్తి భిన్నమైనవి. చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. నరావణే కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. అయినప్పటికీ..సరిహద్దుల భద్రత విషయంలో అజాగ్రత్తతో ఉండకూడదని, చైనాతో సరిహద్దులను పంచుకుంటున్న భారత భూభాగాలన్నింటిపైనా నిఘాను విస్తృతం చేయాల్సి ఉందని ఆయన తేల్చి చెప్పారు.