ఫోన్లోనే చైనాకు జైశంకర్ తీవ్ర హెచ్చరిక: ఆ దళాలను శిక్షించాలంటూ డ్రాగన్ విదేశాంగ మంత్రి వింత వాదన
న్యూఢిల్లీ/బీజింగ్: ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. ఇప్పుడు భారత్పై కుట్రలు పన్నుతూ మరోసారి విమర్శపాలైంది. అయినా తన వక్రబుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. అన్యాయంగా 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఈ డ్రాగన్ దేశం.. తప్పంతా మనదేశంపై తోసేందుకు యత్నిస్తోంది.
భారత సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు: డ్రాగన్ బుద్ధి మారదంటూ అమెరికా ఆగ్రహం
ఫోన్లు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు
ఇరుదేశాల మధ్య ఘర్షణ, అనంతర పరిణామాలపై భారత్, చైనా విదేశాంగ మంత్రులు బుధవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సరిహద్దు సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ప్రణాళిక ప్రకారమే చైనా దాడులు
ఈ సందర్భంగా గాల్వన్లో హింసాత్మక ఘర్షణలు, జవాన్ల మృతిపై జైశంకర్ తీవ్ర నిరసన తెలిపారు. గాల్వన్లో నిర్మాణాలకు చైనా ప్రయత్నించడమే వివాదాలకు కారణమని స్పష్టం చేశారు. హింసకు దారితీసేలా చైనా ప్రణాళిక ప్రకారమే దాడులకు దిగిందనీ, తద్వారా అన్ని ఒప్పందాలు ఉల్లంఘించిందని డ్రాగన్ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
చైనా పునరాలోచించుకోవాలి..
క్షేత్రస్థాయిలో వాస్తవాలు మార్చాలనే ఉద్దేశంతోనే చైనా ప్రయత్నించినట్లు తెలుస్తోందన్నారు. జూన్ 6న మిలటరీ కమాండర్ స్థాయిలో డీస్కలేషన్ నిర్ణయం జరిగిందని గుర్తు చేశారు. ఈ మేరకు సైనికులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్స్ తప్పకుండా పాటించాలని జైశంకర్ తేల్చి చెప్పారు. చైనా తన వైపు నుంచి చేపట్టిన కార్యకలాపాలపై పునరాలోచించుకోవాలని స్పష్టం చేశారు. లేదంటే ద్వైపాక్షిక బంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
Recommended Video
వారిని శిక్షించాలంటూ చైనా వింత వాదన
కాగా, చైనా దళాలు వ్యవహరించిన తీరును ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఈ ఘర్షణలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, ఫ్రంట్లైన్ దళాలను నియంత్రించాలని భారత్ను కోరినట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఈ సమస్యను చర్చల ద్వారానే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని వాంగ్ యీ చెప్పినట్లు తెలిసింది. జూన్ 6న తీసుకున్న నిర్ణయం ప్రకారమే కట్టుబడి ఉండాలని, దాని ప్రకారం నడుచుకోవాలని ఇరుదేశాల మంత్రులు తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. శాంతిని నెలకొల్పేందుకు ఇరువైపుల నుంచి ముందుకు వచ్చినట్లు తెలిసింది. కాగా, సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులు కాగా, 35మందికిపైగా చైనా దళాలు మరణించినట్లు సమాచారం.