సరిహద్దులో అశాంతికి చైనా కుట్రలు, భారీగా బలగాల మోహరింపు: భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: చైనా-ఇండియా ద్వైపాక్షిక ఒప్పందాలకు వ్యతిరేకంగా చైనా వ్యవహరిస్తోంది. లడఖ్ ఉద్రిక్తతల అనంతరం ఇరు దేశాలకు చెందిన భద్రతా దళాలు సరిహద్దు నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే, చైనా మాత్రం బలగాలను ఉపసంహరించుకుంటున్నామని చెబుతూనే.. సరిహద్దులో మరిన్ని బలగాలను దింపుతోంది. ఈ క్రమంలో చైనా కార్యకలాపాలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Recommended Video
రక్షణాత్మక చర్యల్లో భాగంగానే తాము బలగాలను పెంచినట్లు చైనా చెప్పడంపై భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సరిహద్దులో శాంతియుత వాతావరణం ఉందని, దాన్ని చెడగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని భారత్ హితవు పలికింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా భారీ బలగాలు మోహరించడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తె అవకాశాలున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశ్వాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్ఛీ చెప్పారు.
ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కనపెట్టి చైనా భారీ ఎత్తున బలగాలను మోహరించడం సరికాదన్నారు. 1993, 1996లో చేసుకున్న ఒప్పందాలను కూడా చైనా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇరు దేశాల భద్రతా దళాల తమ తమ పరిధిలోనే ఉండాలని ఒప్పందం చేసుకున్నప్పటికీ.. సరిహద్దుకు సమీపంలోకి చైనా తమ బలగాలను చేరవేయడం శాంతియువత వాతావరణానికి విఘాతం కలిగించడమేనని అన్నారు.
సరిహద్దుకు సమీపంలో తమ బలగాలను భారీగా మోహరింపును చైనా సమర్థించుకుంది. ఇది సాధారణ చర్యల్లో భాగమేనని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ బుధవారం పేర్కొన్నారు. సరిహద్దుకు సమీపంలోకి బలగాలను మోహరించడం సాధారణ చర్య కాదని, ఉద్రిక్తతలకు దారితీసే అంశమని భారత్ తేల్చి చెప్పింది. ఇలాంటి చర్యలను సహించబోమని భారత్ స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య చేసుకున్న ఒప్పందాలను భారత్ గౌరవిస్తోందని, అలాగే చైనా కూడా నడుచుకోవాలని హితవు పలికింది.
కాగా, గత సంవత్సరం గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం భారత్, చైనా బలగాల ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. మొదట ఇరుదేశాల తమ బలగాలను సరిహద్దు నుంచి వెనక్కి పిలిపించుకున్నాయి. కానీ, చైనా మాత్రం తన కుట్రలను మానుకోకుండా.. తాజాగా, సరిహద్దులోకి బలగాలను పంపిస్తోంది. దీంతో మరోసారి చైనా ఉద్రిక్తలు నెలకొనేందుకు కారణమవుతోంది.