లడఖ్ నుంచి 3 కి.మీ వెనక్కి మళ్లిన చైనా బలగాలు-తాజా ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
భారత్-చైనా మధ్య రెండేళ్ల క్రితం తలెత్తిన సరిహద్దు ఉద్రిక్తతలు, ఆ తర్వాత చోటు చేసుకున్న గల్వాన్ ఘర్షణలు, వీటిని తగ్గించేందుకు ఇరుదేశాల మిలటరీ అధికారులు జరిపిన చర్చలు చూస్తూనే ఉన్నాం. ఈ చర్చల ఫలితం కూడా సరిహద్దుల్లో కనిపిస్తోంది. గతంలో మిలటరీ చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు చైనా బలగాలు వెనక్కి తగ్గుతున్నాయి.
గతంలో లడఖ్ లో ఇరుదేశాల బలగాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కితగ్గాలని మిలటరీ అధికారుల చర్చల్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరుదేశాల బలగాలు వెనక్కి తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఉపగ్రహ చిత్రాలను చూస్తే లడఖ్ పాయింట్ నుంచి చైనా బలగాలు 3 కిలోమీటర్ల దూరానికి తమ బేస్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. చర్చల ఫలితంగా లడఖ్ స్టాండాఫ్ పాయింట్ వద్ద ఉన్న తమ బేస్ ను 3 కి.మీ దూరానికి చైనా తరలించింది.
తూర్పు లడఖ్లోని గోగ్రా-హాట్ స్ప్రింగ్స్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికులు ఆక్రమించిన స్థానం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉపసంహరించుకున్నారని తాజా ఉపగ్రహ చిత్రాలు చెప్తున్నాయి. 2020లో భారత సైన్యం గస్తీ నిర్వహించే ప్రాంతానికి సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైన్యం ఒక ప్రధాన స్థావరాన్ని దించాలని చూసింది. అప్పట్లో భారత్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరికి చర్చల ఫలితంగా చైనా దీన్ని ఉపసంహరించుకుంది.
భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇరు పక్షాల సైన్యాల మధ్య సృష్టించిన బఫర్-జోన్ లేదా నో-మ్యాన్స్ ల్యాండ్ పరిధిని ఉపగ్రహ చిత్రాలు కూడా చూపవు. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించే చర్యగా ఈ జోన్లో పెట్రోలింగ్ కూడా అనుమతించరు. 2020లో లడఖ్లో వాస్తవాధీన మీదుగా చైనా చొరబాట్లు జరగడానికి ముందు భారత సైన్యం గస్తీ నిర్వహించేందుకు ఉపయోగించిన ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా సైన్యం పెద్ద భవనాన్ని నిర్మించినట్లు ఆగష్టు 12, 2022 నాటి చిత్రం చూపిస్తోంది.