సీఎం నితీష్ కుమార్కు షాకిచ్చేలా ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఫుల్పేజీ యాడ్స్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ వార్తా పత్రికల్లో ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. బీహార్ ఫస్ట్.. బీహారీ ఫస్ట్ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేగాక, వారు మనపై అధికారం కోసం పోరాడుతున్నారు.. నేను బీహార్ ప్రతిష్టను తిరిగి తీసుకొచ్చేందుకు పోరాడుతున్నా అంటూ చిరాగ్ పాశ్వాన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం ఎన్డీఏలో భాగంగా కొనసాగుతున్న ఎల్జేపీ ఈ విధంగా ప్రకటనలు చేయడం బీహార్ సీఎం నితీష్ కుమార్ను వ్యతిరేకించడమేనని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్డీఏలో పక్షమైన జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీహార్ సీఎంగా కొనసాగుతున్నారు.
మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తిరిగి ఎన్డీఏలోకి తిరిగి రావడం వల్లే ఎల్జేపీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ప్రచారం జరుగుతోంది. మాజీ, చిరాగ్ పాశ్వాన్ దళిత వర్గానికే చెందినవారే కావడంతో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. వలస కార్మికుల తరలింపు, కరోనా సంక్షోభం, వరదలపై పాశ్వాన్ విమర్శలు చేసిన నేపథ్యంలోనే మాంఝీని తనకు పోటీగా ఎన్డీఏలోకి తీసుకున్నారని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఎల్జేపీ ప్రకటనపై మాంఝీనే తొలుత స్పందించడం గమనార్హం. నితీష్ కుమార్కు వ్యతిరేకంగా ఎవరైనా నడుచుకుంటే తాము సహించమని అన్నారు. ఎల్జేపీ ప్రశ్నలకు తాను సమాధానం చెబుతానన్నారు. తాను బేషరతుగా ఎన్డీఏలో చేరానని, నితీష్ కుమార్ వల్లే తాను తిరిగి వచ్చానని మాంఝీ స్పష్టం చేశారు.
అయితే, ఈ ప్రకటనలో ఎలాంటి పొరపాటు లేదని ఎల్జేపీ చెబుతోంది. ఈ ప్రకటన నితీష్ కుమార్కు వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం లేదని, తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని ఎల్జేపీ అధికార ప్రతినిధి అష్రఫ్ అన్సారీ తెలిపారు. చిరాగ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలనుకున్నారని, అయితే, కరోనా కారణంగా అది కుదరలేదని అన్నారు. కాగా, ఈ ప్రకటనపై జేడీయూలో కొంత ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. దళిత ఓట్లు కలిసివచ్చే అవకాశం ఉండటంతో మాంఝీని ఎన్డీఏలో చేర్చుకోగా.. ఈ వ్యవహారంపై ఎల్జేపీ నేతలు కొంత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.