సోనియా చెప్పినా చిరంజీవి రాజకీయాలకు దూరమే?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి రాజకీయాలకు ఎడంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెసు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పినా ఆయన పెడచెవిన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ తన దూత ద్వారా చిరంజీవికి సూచించినా, ఆయన అందుకు సిద్ధపడలేదని అంటున్నారు. పూర్తి స్థాయిలో ఆయన తన 150వ చిత్రంపై దృష్టి పెట్టినట్లు, దీంతో కాంగ్రెసు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు
తాను రాజ్యసభ సభ్యుడిగా మాత్రం కొనసాగుతానని చిరంజీవి సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది. రుణమాఫీ సమస్యపై కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేసినా చిరంజీవి ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.
తన 150 చిత్రం కోసం ఆయన సన్నబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, డైరెక్టర్లతో సమావేశాలు, కథ తదితర అంశాలపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. కాగా, నాగార్జున నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు ఫస్ట్ సీజన్ షో ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన చిత్రీకరణ ఇది వరకే పూర్తయినట్లు చెబుతున్నారు. ఈ షో రేపు గురువారం మాటీవీలో ప్రసారం కానుంది.