టీ బిల్లుపై చిరంజీవి: కిరణ్ రెడ్డి చివరి బంతిపై నెపం
తెలంగాణ ఏర్పాటును ఆపడానికి తన వద్ద ఇంకా బంతులున్నాయని, చివరి బంతే మిగిలి ఉందంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చారు. రాష్ట్ర విభజనకు నిరసనగా తాను రాజీనామా చేస్తానని అంటున్నట్లు కూడా మీడియాలో పెద్ద యెత్తున వార్తలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తానని అంటున్నారని, అయితే ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆగాలని చెప్పామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇది వరకు చెప్పారు.
ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారనే ప్రచారం ముమ్మరంగానే ఉంది. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వల్ల ఇప్పుడు ఫలితమేదీ ఉండదని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు మంగళవారం ఢిల్లీలో అన్నారు. రాష్ట్ర బంద్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పిలుపు ఇవ్వడం వల్ల కూడా ఫలితం ఉండదని ఆయన ఢిల్లీలో అన్నారు.
అశోక్ బాబు కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే అభిప్రాయం ఉంది. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం ప్రకారమే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తూ వస్తున్నారని అంటారు. దీన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి రేపు కూడా రాజీనామా చేస్తారా అనేది అనుమానంగానే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానం వ్యూహం మేరకు విభజనకు సహకరిస్తూ వస్తున్నారని వైయస్ జగన్ విమర్శిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు కూడా అదే విమర్శ చేస్తున్నారు.
కాగా, లోకసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతం వరకు ఏడుగురు శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. పెందుర్తి శాసనసభ్యుడు రమేష్ రావు, ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు సురేష్ కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. కాంగ్రెసు పర్చూరు శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా రాజీనామా చేశారు.
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వచ్చిన మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాస రావు పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి రాజీనామాతో పాటు తమ రాజీనామాలు ఉంటాయని చెబుతూ వచ్చిన వారు ముందుగానే రాజీనామాలు చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారనే విశ్వాసం లేకపోనే వారు రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు.