పక్క రాష్ట్రంలోను చిరుVsపవన్, అభిమానుల పోటాపోటీ
హైదరాబాద్/బెంగళూరు: పక్క రాష్ట్రమైన కర్నాటకలోను మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పోటా పోటీకి సిద్దమయ్యారట. మెగా కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా కర్నాటకలోను పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అక్కడ కాంగ్రెసు పార్టీ తరఫున కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, బిజెపి తరఫున జనసేన పార్టీ అధ్యక్షలు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారనే వార్తల నేపథ్యంలో.. స్థానిక అభిమానులు సైతం అప్పుడే రెండుగా విడిపోయారట.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ప్రచార సారథిగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్... బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. లోకసభ ఎన్నికలలో నరేంద్ర మోడీకి ఓటు వేయాలని ఇప్పటికే పవన్ తెలుగు ప్రజలను కోరారు. కర్నాటకలోను పవన్ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారట.

కర్నాటకలోని పలు ప్రాంతాల్లో తెలుగు ప్రజలు, మెగా అభిమానులు చాలా ఉన్నారు. చిరు గతంలో కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లోను ప్రచారం చేయనున్నారని సమాచారం. కాంగ్రెసు పార్టీ తరఫున చిరంజీవి, బిజెపి తరఫున పవన్ ప్రచారం నేపథ్యంలో... తమ అభిమాన నటులు వస్తే పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారట.
పవన్ బెంగళూరు సెంట్రల్, ఉత్తర, దక్షిణ, గ్రామీణ జిల్లా, కోలారు, చిక్ బళ్లాపుర్, తుమకూరు, బళ్లారి తదితర నియోజకవర్గాల్లో చిరు కాంగ్రెసుకు, పవన్ బిజెపికి ప్రచారం చేయనున్నారట. కాగా, ఈ నెల 13వ తేదీన తమ పార్టీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడితో పాటు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని బిజెపి నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications