మీకో స్పీకర్ను ఎన్నుకోండి: ఎంపీలపై సుమిత్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: లోకసభ సమావేశం జరుగుతున్న సమయంలో సభకు పదే పదే తీవ్ర అంతరాయం కలిగించిన కాంగ్రెస్, ఆర్జెడి ఎంపీల దోరణీపై స్పీకర్ సుమిత్రా మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ శాంతంగా ఉండే ఆమె శుక్రవారం ఎంపీల తీరుపై తీవ్ర అసహనానికి గురయ్యారు. యుపిఎస్సి పరీక్ష వివాదాం, మహారాష్ట్రలోని పుణె జిల్లాలో భారీ వర్షం కారణంగా బురదలో చిక్కుకుని ఓ గ్రామంలోని పదుల సంఖ్యలో ప్రజలు మృతి చెందిన ఘటనపై సభలో తీవ్ర దుమారం రేగింది.
సభకు పదే పదే అంతరాయం కలిగిస్తున్న ఎంపీలు జ్యోతిరాదిత్య సింధియా, పప్పూ యాదవ్ తదితరుల తీరుపై స్పీకర్ సుమిత్ర మండిపడ్డారు. మీరు ఇలాగే సలహాలిస్తూ ఉండాలని పట్టుదలగా ఉంటే.. మీరు సొంతంగా కొత్త స్పీకర్ను ఎంపిక చేసుకోండని ఆమె స్పష్టం చేశారు.

అంతకంటే ముందు, యుపిఎస్సి పరీక్ష వ్వవహారంపై ఆర్జెడి ఎంపి పప్పూ యాదవ్ సహనం కోల్పోయి నేరుగా సభ వెల్లోకి వెళ్లి చేతిలో ఉన్న ఓ వార్తా పత్రికను చించి ముక్కలను విసిరేశారు. కొన్ని పేపర్ ముక్కలు స్పీకర్ టేబుల్పై పడ్డాయి. పుణె జిల్లాలో బురద వరద దుర్ఘటనపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై కొన్ని వివరణల కోసం కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే, ఇతర కాంగ్రెస్ ఎంపీలు పదే పదే సభకు అంతరాయం కలిగించారు.
మంత్రి వెంకయ్య నాయుడు లోకసభలో శుక్రవారం జరిగిన ఘటనపై స్పందిస్తూ.. కొందరు సభ్యుల ప్రవర్తన ఏమాత్రం హుందాగా లేదని అన్నారు. అది సమర్థనీయం కాదని చెప్పారు. యుపిఎస్సి వ్యవహారంపై సంబంధిత కమిటీ క్షుణ్ణమైన పరిశీలన జరుపుతోందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications