క్రికెట్ బెట్టింగ్: మాజీ ఐపీఎస్ విచారణ
హుబ్బళి: క్రికెట్ బెట్టింగ్ దందాలో పోలీసులకు వాటాలు వెళ్లాయని వెలుగు చూడటంతో దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు మాజీ ఐపీఎస్ అధికారిని విచారణ చేసి వివరాలు తెలుసుకున్నారు. హుబ్బళి రిటైర్డ్ పోలీసు కమిషనర్ రవీంద్ర ప్రసాద్ ను విచారణ చేశారు.
గురువారం నాలుగు గంటల పాటు రవీంద్ర ప్రసాద్ ను విచారణ చేసిన సీఐడి అధికారులు 45 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. హుబ్బళి-దారవాడ జంట నగరాలలో క్రికెట్ బెట్టింగ్ దందా పెద్ద ఎత్తున జరిగింది. బుక్కీలు బెట్టింగ్ దందాలోని డబ్బులో పోలీసులకు వాటా ఇచ్చారు.
విషయం తెలుసుకున్న ఓ ప్రయివేటు టీవీ చానెల్ రహస్య కార్యాచరణ చేపట్టింది. బుక్కీలు, పోలీసు అధికారులు ఒకే చోట చేరి డబ్బులు వాట వేసుకుంటున్న దృశ్యాలు రికార్డు చేసి ప్రసారం చేశారు. ఈ విషయంపై కర్ణాటక అసెంబ్లీలో దూమరం చెలరేగింది. కేసు సీఐడి అధికారులకు అప్పగిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది.
పోలీసు అధికారులతో పాటు అప్పటి హుబ్బళి పోలీసు కమిషనర్ రవీంద్ర ప్రసాద్ కు వాటాలు వెళ్లాయని వెలుగు చూసింది. గత నెల రవీంద్ర ప్రసాద్ రిటైడ్ అయ్యారు. సీఐడి ఐజీపీ శరత్ చంద్ర, డీఎస్పీలు కుమారస్వామి, రత్నాకర్ లు రవీంద్ర ప్రసాద్ కు నోటీసులు జారీ చేసి విచారణ చేశారు.
ఐఏఎస్ అధికారి ఇంట్లో రూ. కోట్లు!
క్రికెట్ బెట్టింగ్ దందా కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆగస్టు 5వ తేదిన సీనియర్ ఐఏఎస్ అధికారి కపిల్ మోహన్ కు చెందిన అపార్ట్ మెంట్ లో సోదాలు చేశారు. ఆ సందర్బంలో అధికారులు షాక్ కు గురైనారు.
ఇంటిలో 4.37 కోట్ల రూపాయల నగదు, 2.5 కేజీల బంగారు నగలు, వజ్రాలతో పాటు విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమాస్తుల కేసును లోకాయుక్తకు అప్పగించాలని సీఐడి అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి మనవి చేశారు. లోకాయుక్త అధికారులు ఐఏఎస్ అధికారి కపిల్ మోహన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.