కరోనా ఉధృతి: సీఐఎస్సీఈ పది, 12వ తరగతి పరీక్షలు వాయిదా
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సీఐఎస్సీఈ బోర్డు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీఐఎస్సీఈ పది, 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ది కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
పరీక్ష నిర్వహణపై తుది నిర్ణయాన్ని జూన్ తొలి వారంలో వెల్లడిస్తామని సీఐఎస్సీఈ తెలిపింది. ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు కాగా, 12వ తరగతి పరీక్షలను కేంద్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడిన క్రమంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేయడంతోపాటు మిగితా పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో శనివారం జరగాల్సిన ఎస్సీ గురుకుల ప్రతిభ కాలేజీల రెండో ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా తీవ్రత కారణంగా సీఓఈ రెండో స్క్రీనింగ్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 2020-21 సంవత్సరానికి గానూ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తు గడువును కూడా పొడిగించారు. కొత్త రెన్యూవల్ దరఖాస్తుల కోసం మే 31 వరకు ఈ పాస్ పోర్టల్ పనిచేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. నీట్ 2021 పరీక్షలున కూడా కేంద్రం వాయిదా వేసిన విషయం తెలిసిందే.