అమ్మకానికి అంబానీ మరో కంపెనీ: ఈసారి మీడియా గ్రూపు..ఆ కంపెనీతో చర్చలు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనకు చెందిన న్యూస్ మీడియాను టైమ్స్ గ్రూప్కు అమ్మే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మీడియా బిజినెస్లో తనకు అనుకున్నంతగా లాభాలు రావడం లేదని భావించిన అంబానీ తన మీడియా సంస్థలను ఆస్తులను విక్రయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సంచలనం: ఆర్కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
అమ్మకానికి అంబానీ మీడియా గ్రూపు
అంబానీకి చెందిన నెట్వర్క్ 18 మీడియా & ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ను కొనేందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిషర్ బెన్నెట్ కోల్మాన్&కో సంస్థ ముందుకు రావడంతో అంబానీ మీడియాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఒక సలహాదారుడిని టైమ్స్ గ్రూప్ నియమించుకోనున్నట్లు సమాచారం. చర్చల పూర్తిగా వ్యక్తిగతం కనుక వాటి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని ఈ డీల్పై అవగాహన ఉన్న కొందరు చెప్పారు. అంబానీ కూడా మీడియా గ్రూప్ను ఒకేసారి అమ్మివేసి అందులోనుంచి బయటకు రావాలని భావిస్తున్నారని ఒకరు చెప్పారు.
ఇంకా తొలిదశలోనే చర్చలు..
ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని అవి తొలిదశలోనే ఉన్నాయని మ్యాటర్ పై అవగాహన ఉన్న వ్యక్తులు చెప్పారు. ఇంకా ఒక డీల్కు రాలేదని సమాచారం. అయితే చర్చల్లో భాగంగా మరికొన్ని కంపెనీలు కూడా కొనుగోలుకు ముందుకొచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే నెట్వర్క్ 18 ఎంటర్టెయిన్మెంట్ గ్రూపులోని సినిమా ఛానెళ్లు, మ్యూజిక్ ఛానెల్స్, కామెడీ ఛానెల్స్లను సోనీకి విక్రయించారు.
రేసులో టైమ్స్ గ్రూప్, జపాన్ సంస్థ
ఇదిలా ఉంటే జపాన్ సంస్థ ఒకటి నెట్వర్క్ 18 మీడియా గ్రూపు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్లు బ్లూంబర్గ్ సంస్థ ఓ కథనం ప్రచురించింది. ఇక ఇప్పటికే మీడియా గ్రూప్ ద్వారా 1.78 బిలియన్ రూపాయల మేరా నష్టం వాటిల్లిందని నెట్వర్క్ 18 సంస్థ వెల్లడించింది. ఇక నికర రుణం 28 బిలియన్ రూపాయలుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉంటే నెట్వర్క్ 18 గ్రూపుకు చెందిన షేర్లు గురువారం రోజున ఒక్కసారిగా 10శాతం పెరిగాయి. అయితే గత ఆరునెలల్లో ఈస్థాయిలో పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
జియో ఉండగా మీడియా ఎందుకనే భావనలో అంబానీ
ఇదిలా ఉంటే గతనెలలో రిలయన్స్ సంస్థ డిజిటల్ సర్వీసులను ప్రారంభించింది. ఇందులో ఈ కామర్స్ నుంచి ఎంటర్టెయిన్మెంట్ వరకు అన్ని సేవలను అందివ్వనుంది. ఇదంతా జియో నెట్వర్క్పైనే జరుగుతుంది. ఇందుకోసం 50 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. నెట్వర్క్ 18ను రిలయన్స్ సంస్థ 2014లో కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా 56 లోకల్ ఛానెల్స్ను అందిస్తోంది. ఇందులో న్యూస్ మరియు ఎంటర్టెయిన్మెంట్ ఛానెల్స్ ఉన్నాయి. న్యూస్కు సంబంధించిన వాటిలో మనీకంట్రోల్, న్యూస్ 18, సీఎన్బీసీ టీవీ 18 డాట్ కాట్, క్రికెట్ నెక్ట్స్, ఫస్ట్ పోస్టులు ఉన్నాయి. నెట్వర్క్ 18కు చెందిన సబ్సిడరీ సంస్థ టీవీ 18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ కింద వార్తా ఛానెల్స్ ఉన్నాయి.