షూట్ ఎట్ సైట్: ఆస్తులను ధ్వంసం చేసే వారిని అక్కడికక్కడే కాల్చి పారేయండి: రైల్వే మంత్రి..!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కొద్ది రోజులుగా దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోన్న ఆందోళనల నేపథ్యంలో.. రైల్వే మంత్రి సంచలన ప్రకటన చేశారు. రైల్వేలు సహా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి పాల్పడే ఆందోళనకారులను అక్కడికక్కడే కాల్చి పారేయాలని అన్నారు. ఓ మంత్రిగా తాను ఈ మాట చెబుతున్నానని ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినప్పటి నుంచీ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు ఎడతెగకుండా కొనసాగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈశాన్యంలోని అస్సాం, త్రిపురల్లో ఆరంభమైన పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక జ్వాలలు పలు రాష్ట్రాలకు వ్యాపించాయి. పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు రైల్వే ఆస్తులను టార్గెట్ గా చేసుకుని చెలరేగిపోయారు.

పశ్చిమ బెంగాల్ లో రైల్వే ఆస్తులే టార్గెట్..
పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్, హౌరా వంటి జిల్లాల్లో రైల్వే ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం కలిగించారు. కొన్ని చోట్ల రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు. పట్టాలను సైతం పెకిలించి వేశారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఫలితంగా వందలాది మంది ప్రయాణికులు సైతం అవస్థలకు గురయ్యారు. పలు రైళ్లు రద్దయ్యాయి. మరి కొన్నింటిని దారి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయా సంఘటనలపై రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు సమగ్ర నివేదికను తెప్పించుకున్నారు.

విధ్వంసం మిగిల్చిన నష్టంపై నివేదిక..
ఈ నివేదికపై రైల్వే భద్రతా కమిషన్, రైల్వే బోర్డు అధికారులతో సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారు. ఆందోళనకారుల చర్యల వల్ల కోట్ల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు రైల్వే శాఖ అధికారులు. రైళ్లను అర్ధాంతరంగా రద్దు చేయడం వల్ల ప్రయాణికులు అవస్థల పాలయ్యారని, దీనికంతటికీ కారణం ఆందోళనకారుల చర్యలేనని రైల్వే మంత్రిత్వ శాఖకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఆందోళనకారులను ఉపేక్షంచబోం..
దీనిపై రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆందోళనకారుల చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. రైల్వే ఆస్తులకు గానీ, ప్రభుత్వ ఆస్తులకు గానీ నష్టం వాటిల్లజేసే వారిని అక్కడికక్కడే కాల్చి పారేయాలని అన్నారు. రైల్వే శాఖలో 13 లక్షలమందికి పైగా ఉద్యోగులు, కార్మికులు రేయింబవళ్లు పని చేస్తున్నారని, వారి శ్రమ ఇలాంటి చర్యల వల్ల వృధా అవుతోందని అన్నారు.

ప్రతిపక్షాల మద్దతుతో చెలరేగుతున్న అసాంఘిక శక్తులు..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల్లో అసాంఘిక శక్తులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని, అలాంటి వారికి ప్రతిపక్షాలు అండగా ఉంటున్నాయని సురేష్ అంగడి విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏ ఒక్క భారతీయుడికీ ఎలాంటి ఇబ్బందులు రావని అన్నారు. కొంతమంది మాత్రమే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఆర్థికంగా దేశాన్ని అస్థిర పర్చడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.

ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు..
ఆందోళనకారులు, అసాంఘిక శక్తుల చర్యల వల్ల కోట్లాది రూపాయల మేర ప్రజాధనం వృధా అవుతోందని అన్నారు. రైళ్లు, రైల్వే లైన్లు, స్టేషన్లను అభివృద్ధి పర్చడానికి సంవత్సరాల తరబడి సమయం పడుతుందని, అలాంటిది.. నిమిషాల్లో ధ్వంసం చేయడాన్ని తాము సహించబోమని సురేష్ అంగడి హెచ్చరించారు. రైల్వే అధికారులు, జిల్లా పాలనా యంత్రాంగానికి తాను ఓ మంత్రిగా ఆదేశిస్తున్నానని, రైల్వే, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిని అక్కడికక్కడే షూట్ చేయాలని అన్నారు.












Click it and Unblock the Notifications