Citizenship Bill:నాడు కశ్మీర్లో..నేడు అస్సాంలో, తుపాకీ నీడలో ఈశాన్యం
గౌహతి: పౌరసత్వ సవరణ బిల్లు అస్సాం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన సెగలు మిన్నంటుతున్నాయి. విద్యార్థి సంఘాలు బిల్లుకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తుండగా... పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటికే బిల్లు లోక్సభలో పాస్ కాగా రాజ్యసభలో కూడా బిల్లును పాస్ చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక ఆందోళనళతో అస్సాం రాష్ట్రం అట్టుడికిపోతున్న నేపథ్యంలో అక్కడికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.

మిన్నంటుతున్న ఆందోళనలు
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాం త్రిపుర రాష్ట్రాల్లో నిరనసలు మిన్నంటుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాజ్యసభలో బిల్లు పాస్ చేయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో పరిస్థితులను చక్కబెట్టేందుకు 5వేల మందితో కూడిన పారామిలటరీ బలాలు రంగంలోకి దిగాయి. ఆందోళన నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులో పెట్టేందుకు ఈశాన్య రాష్ట్రాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి పారామిలటరీ బలగాలు.

రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు
ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జవాన్ల నీడకింద ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్రం ఎలాగైతే బలగాలను మోహరించిందో ఇప్పుడు వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు పాస్ చేయిస్తున్న వేళ కూడా జవాన్లను ఈశాన్య రాష్ట్రంలో మోహరించింది. కశ్మీర్లోని నాటి పరిస్థితులే నేడు అస్సాంతో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే 20 కంపెనీలకు చెందిన 2000మంది జవాన్లను కశ్మీర్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తరలించింది. ఇక మరో 30 కంపెనీల జవాన్లు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు కేంద్రం తరలించింది. ఇక సీఆర్పీఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్రసీమా బల్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగం
అస్సాం సెక్రటేరియట్ ఎదురుగా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తుండగా పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని వైపుల నుంచి విద్యార్థులు సెక్రటేరియట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. మరొక విద్యార్థుల గ్రూప్ గణేష్ గురి ప్రాంతంను ముట్టడించింది. బారికేడ్లు అడ్డంగా పెట్టగా వాటిని విద్యార్థులు ధ్వంసం చేశారు. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇక పరిస్థితి చేయిదాటి పోతోందని గ్రహించిన పోలీసులు విద్యార్థులపై భాష్ప వాయువును ప్రయోగించారు.

లాఠీ చార్జ్లో పలువురు విద్యార్థులకు గాయాలు
పోలీసులు జరిపిన లాఠీ చార్జ్లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శరబానంద్ సోనోవాల్ ప్రభుత్వం చర్యలపై విద్యార్థులు నిప్పులు చెరిగారు. పౌరసత్వ సవరణ బిల్లు రద్దు చేసే వరకు తమ ఆందోళనలు ఆగవని విద్యార్థి సంఘాలు స్పష్టం చేశాయి. ఇక ఆందోళనలు దిబ్రూఘర్ జిల్లాను కూడా తాకాయి. ఇక్కడ కూడా పోలీసులు ఆందోళనకారులపై భాష్పవాయువును ప్రయోగించడంతో పాటు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. దీన్ని కవర్ చేస్తున్న ఓ జర్నలిస్టు గాయపడ్డాడు.

ఆందోళనల నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలు మిన్నంటుతుండటంతో నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేస్ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేసింది.కొన్ని రైళ్ల షెడ్యూల్ను మార్పు చేసింది. 14 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రైల్వే స్టేషన్లలో పటిష్టమైన బందోబస్తు చేసింది. రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.












Click it and Unblock the Notifications