సాహితీవేత్త హత్య: శ్రీ రామ్ సేన నాయకుడి విచారణ
మంగళూరు: ప్రముఖ కన్నడ సాహితీవేత్త డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసుకు సంబంధించి క్రైం బ్రాంచ్ పోలీసులు (సీసీబీ) శ్రీరామ్ సేన నాయకుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.
శ్రీరామ్ సేన నాయకుడు ప్రసాద్ అత్తావర్ ను గురువారం మంగళూరులో సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య జరిగిన తరువాత ఈ హత్యను సమర్థిస్తు ప్రసాద్ మెసేజ్ లు పంపించారని పోలీసులు అంటున్నారు.
అంతే కాకుండ సాహితీవేత్త ఎం.ఎం. కలబుర్గిని హత్య చేసిన వారితో ప్రసాద్ కు సంబంధాలు ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కలబుర్గి హత్య జరిగిన తరువాత బంట్వాళ పోలీసులు భవిత్ శెట్టి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
భవిత్ శెట్టి సైతం కలబుర్గి హత్యను సమర్థిస్తు రెండు ట్వీట్ లు చెయ్యడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ప్రముఖ కన్నడ సాహితీవేత్త కలబుర్గిని ఆగస్టు 31వ తేదిన ఆయన ఇంటిలోనే రివాల్వర్ తో కాల్చి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.