సుప్రీంలో ఆసక్తికర సంభాషణ- దృష్టిలోపం ఉన్న లాయర్లకూ అనువుగా కోర్టులు- సీజేఐకి సూచనలు..
దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ప్రస్తుతం దృష్టిలోపం ఉన్న లాయర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి తగిన సౌకర్యాలు లేకపోవడంతో వృత్తిని నెరవేర్చలేకపోతున్నట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ మేరకు వారికి దేశంలో కోర్టుల్ని అందుబాటులోకి తెచ్చే విషయంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ సీనియర్ న్యాయవాది ఎస్కే రుంగ్తా నుంచి కీలక సలహాలు తీసుకున్నారు.
దృష్టి వైకల్యం ఉన్న న్యాయవాదులు రోజూ కోర్టుల్లో పనిచేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి తనకు సలహాలు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎస్కే రుంగ్తాను తాజాగా సీజేఐ చంద్రచూడ్ కోరారు. దీంతో ఆయన ఈ విషయంపై అధ్యయనం చేసి సీజేకు తన సలహాలు అందించారు. ఈ సలహాలు ఇచ్చిన సీనియర్ న్యాయవాది రుంగ్తాకు మరో ప్రత్యేకత ఉంది. ఆయన ఏడాది వయస్సు ఉన్నప్పుడే తన కంటిచూపు కోల్పోయారు. అయినా ఎన్నో ఇబ్బందులకోర్చి లాయర్ కావడమే కాకుండా పలు కేసులు కూడా వాదిస్తున్నారు. దీంతో సీజేఐ ఆయన్ను సలహాలు కోరారు.
అలాగే ఇవాళ మరో ఘటన కూడా చోటు చేసుకుంది. సీజేఐకు సలహాలు ఇచ్చేందుకు కోర్టుకు హాజరైన ఎస్కే రుంగ్తాను జస్టిస్ చంద్రచూడ్ ఓ ప్రశ్న అడిగారు. మిమ్మల్ని ఓ వ్యక్తిగత ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఏమీ అనుకోనంటే.. మీరు ఇతర న్యాయవాదుల్లా కోర్టులో ఇతర కేసుల డాక్యుమెంట్లు ఎలా సేకరిస్తున్నారని అడిగారు. దానికి ఆయన నేను ఇంటర్నెట్ ద్వారా పెన్ డ్రైవ్ లో సమాచారం తీసుకుని దాన్ని బ్రెయిలీ లిపిలోకి మార్చి వాడుకుంటున్నట్లు జవాబిచ్చారు. దీనికి స్పందించిన సీజేఐ తాను ఓ ఈ-కమిటీని ఏర్పాటు చేస్తానని, ఈ సమస్యకు పరిష్కారం చూపడమే తన ముందున్న కర్తవ్యమన్నారు.
ఈ సందర్భంగా రుంగ్తా సీజేఐకు ఓ సలహా ఇచ్చారు. కోర్టుల్లో వాడుతున్న పీసీల్లో సాఫ్ట్ వేర్ దృష్టిలోపం కలిగిన న్యాయవాదులకు అనువుగా ఉండాలని కోరారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో దృష్టిలోపం కలిగిన లాయర్లు ఈ సమాచారాన్ని బ్రెయిలీ లిపిలోకి సులభంగా మార్చుకోగలరని సూచించారు. సాఫ్ట్ వేర్ లో సమాచారం వాయిస్ ఇన్ పుట్ గా మార్చే అవకాశం ఉన్నాదాన్ని కోర్టులో వాడలేమని గుర్తుచేశారు. దీనిపై స్పందించిన సీజేఐ.. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఎన్ఐసీలో హెడ్ సైంటిస్ట్ ను మీతో సమన్వయం చేసుకుని కోర్టుల్ని దృష్టిలోపం ఉన్న న్యాయవాదులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామన్నారు.