మరో ట్విస్ట్: సెలవులో జస్టిస్ రమణ -సుప్రీంకోర్టు కొలీజియం భేటీపై నీలినీడలు -సీజేఐ బోబ్డే తదుపరి స్టెప్?
దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో నియామకాలకు సంబంధించి అభ్యర్థులను పరిశీలించేందుకుగానూ సిట్టింగ్ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే గురువారం నాడు కోలీజయం భేటీ జరపాల్సి ఉండగా, కొలీజియంలో రెండో సీనియర్మోస్ట్ జడ్జి, కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళే సెలవు తీసుకున్నారు. ఇవాళ కొలీజయం సమావేశ నిర్వహణపై మరో ఇద్దరు జడ్జిలు కూడా అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో భేటీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
-జస్టిస్ రమణకు పదవి దక్కినా భేటీ ఎందుకు? -తొలి మహిళా సీజేఐ!
అసలేం జరిగిందంటే..
న్యాయమూర్తుల నియామకాలకు వీలుగా కేంద్రానికి అభ్యర్థులు లేదా అర్హులైనవారి పేర్లను చర్చించడం కోసం సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే గురువారం కొలీజియం భేటీని నిర్వహించాలనుకున్నారు. తన 14 నెలల పదవీ కాలంలో.. తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరును సూచించడం తప్ప సుప్రీంకోర్టులో జడ్జిల భర్తీకి సంబంధించి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఎలాంటి ప్రతిపాదనలను కేంద్రానికి పంపలేదు. ఇంకో రెండు వారాల్లో పదవి నుంచి దిగిపోనుండగా జస్టిస్ బోబ్డే నేతృత్వంలో ఇవాళ జరగాల్సిన కొలీజయం భేటీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. చాలా రోజుల కిందటే ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే, ఇప్పటికే తదుపరి సీజేఐగా జస్టిస్ రమణను నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసినందున గురువారం కొలీజియం మీటింగ్ అవసరం లేదనే అర్థంలో ఇద్దరు జడ్జిలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ప్రఖ్యాత 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' ఓ కథనం రాసింది. దానికి కొనసాగింపుగా..
కొలీజయం భేటీ జరిగేనా?
కొలీజియంలో జస్టిస్ బోబ్డేతోపాటు కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రోహింటన్ నారీమన్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ (యూయూ లలిత్), జస్టిస్ అజయ్ మాణిక్రావ్ ఖన్విల్కర్ (ఏఎం ఖన్విల్కర్)ఉండగా ఇప్పటికే ఇప్పటికే ఇద్దరు జడ్జిలు కొలీజియం భేటీని ఈ సమయంలో నిర్వహించడం సరికాదని అభిప్రాయపడినట్లు 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' కథనంలో పేర్కొన్నారు. ఆ వార్త వైరల్ అవున్న క్రమంలోనే సీనియర్ నంబర్ 2, కాబోయే సీజేఐ జస్టిస్ రమణ కూడా గురువారం కోర్టుకు రాలేదు. ఐదుగురు జడ్జిల్లో సీజేఐ పోగా, ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాన్ని చెప్పడం, జస్టిస్ రమణ కూడా కోర్టుకు రాకపోవడంతో అసలు కొలీజియం సమావేశమవుతుందా, కాదా అనేది ఆసక్తికరంగా మారింది.
సెలవులో జస్టిస్ ఎన్వీ రమణ
సీజేఐ బోబ్డే ఇవాళ కొలీజియం నిర్వహించాలని భావించినప్పటికీ కాబోయే సీజేఐ జస్టిస్ రమణ కోర్టు విధులకు రాలేదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఓ ప్రకటన చేసింది. ''2021 ఏప్రిల్ 8 వ తేదీ గురువారంనాడు జస్టిస్ ఎన్వీ రమణ అందుబాటులో లేని కారణంగా ఆయనకలిసి జస్టిస్ అనిరుద్ధ బోస్ రెండో నంబర్ కోర్టులో టేకప్ చేయాల్సిన విచారణలను నేడు రద్దవుతాయి'' అని ప్రకటనలో పేర్కొన్నారు. సీజేఐ బోబ్డే కొలీజియం భేటీని ఫిక్స్ చేసిన తేదీలోనే(ఇవాళ) జస్టిస్ రమణ నెలవు తీసుకున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' తెలిపింది. దీంతో ఒక్కరు తప్ప కొలీజియంలోని జడ్జిలంతా భేటీకి గైర్హాజరహాజరయ్యే పరిస్థితి నెలకొంది. మరి సీజేఐ ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొలీజియం భేటీని నిర్వహిస్తారా, జడ్జిలెవరూ రాకుంటే సమావేశాన్ని వాయిదా వేస్తారా అనేది తేలాల్సిఉంది.