ఆ విషయంపై యూఏఈ మంత్రితో మాట్లాడిన సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటిస్తోన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హిమ కోహ్లీ, డీవై చంద్రచూడ్, లావు నాగేశ్వర రావు ఉన్నారు. మూడు రోజుల పాటు ఎమిరేట్స్లో పర్యటిస్తారు. ఆర్బిట్రేషన్ ఇన్ ది ఎరా అఫ్ గ్లోబలైజేషన్ పేరిట శనివారం దుబాయ్లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో వారు పాల్గొనాల్సి ఉంది.
దుబాయ్లో నివసించే తెలుగు ప్రజలు, వ్యాపార, పారిశ్రామకవేత్తలు సీజేఐ ఎన్వీ రమణ, ఇతర న్యాయమూర్తులకు ఘనంగా స్వాగతం పలికారు. అబుధాబిలోని ఇండియా సోషల్ కల్చర్ సెంటర్లో నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. అరబ్ ఎమిరేట్స్లోని భారతీయ
అసోసియేషన్లు నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి అంశాల గురించి ప్రస్తావించారు.

అరబ్ ఎమిరేట్స్లో 175 మంది భారత ఖైదీలు ఉన్నారని, వారిని స్వదేశానికి తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను తీసుకున్నామని ఎన్వీ రమణ చెప్పారు. దీనికోసం ఆ దేశ న్యాయ శాఖ మంత్రితో మట్లాడానని, ఖైదీల అప్పగింతకు ఆయన అంగీకరించారని అన్నారు. 175 మంది ఖైదీలను స్వదేశానికి అప్పగించాలనే ప్రతిపాదన సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవట్లేదని చెప్పారు. వారిని స్వదేశానికి అప్పగించే విషయాన్ని పరిశీలించాలని కోరినట్లు చెప్పారు.

అరబ్ ఎమిరేట్స్లోని కారాగారాల్లో మగ్గుతున్న తమ వారిని కలుసుకోవడానికి భారతీయులకు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని న్యాయ శాఖ మంత్రికి సూచించానని, దీనిపట్ల సానుకూలంగా స్పందించారని అన్నారు. ఇవన్నీ మానవతా దృక్పథంతో తీసుకోవాల్సిన నిర్ణయాలని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. విదేశాల్లో మగ్గుతున్న భారతీయులను స్వదేశానికి తీసుకుని రావడానికి అవసరమైన చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications