ఆ రెండు ఎంతో తృప్తినిచ్చాయి: రిటైర్మెంట్ వేళ.. అంతరంగాన్ని ఆవిష్కరించిన సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఇవ్వాళ పదవీ విరమణ చేయబోతోన్నారు. 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అయన కంటే ముందు సీజేఐగా పని చేసిన శరద్ అరవింద్ బాబ్డే నుంచి బాధ్యతలను స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి 48వ చీఫ్ జస్టిస్గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.

వారసుడిగా..
ఎన్వీ రమణ తరువాత చీఫ్ జస్టిస్గా ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం యూయూ లలిత్ బాధ్యతలను స్వీకరించనున్నారు. పదవీ విరమణ చేయబోతోన్న సీజేఐ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించనుంది. దీనికోసం ప్రత్యేకంగా వీడ్కోలు సభను నిర్వహించబోతోంది.

వీడ్కోలు సభ..
సాయంత్రం 4:15 నిమిషాలకు సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయంలో గల మెయిన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. తదుపరి సీజేఐ యూయూ లలిత్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు దీనికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను సన్మానించారు. వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సభలో ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

ఆ రెండు అంశాలపై దృష్టి..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి అత్యున్నత స్థానాన్ని అందుకున్న తెలుగువాడిగా గర్వపడుతున్నానని ఎన్వీ రమణ అన్నారు. తన హయాంలో జ్యుడీషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి, న్యాయమూర్తుల నియామకాలపై ప్రధానంగా దృష్టి సారించానని చెప్పారు. కొలీజియం ద్వారం 224 మంది న్యాయమూర్తులను అపాయింట్ చేశానని గుర్తు చేశారు. ఇంకా కొందరు పేర్లను కేంద్రానికి పంపించానని, అవి ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

నమ్మకాన్ని వమ్ము చేయలేదు..
సాధ్యమైనంత వరకు తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధులను నిర్వర్తించానని భావిస్తున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టులో ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వారి సంఖ్య ప్రస్తుతం అయిదుగా ఉందని, ఇది మరింత పెరుగుతుందని అన్నారు. సీజేఐగా తాను సక్సెస్ కావడానికి ఢిల్లీ హైకోర్టు తనకు ఓ లాంచ్ ప్యాడ్లా ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ హైకోర్టుకు సమానంగా మరొకటి లేదని కితాబిచ్చారు. చాలా హైకోర్టుల్లో న్యాయమూర్తులు సాయంత్రం 4 గంటల వరకే పరి చేస్తుంటారని, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు మాత్రం ఉదయం 7-8 నుంచి రాత్రి 8-9 గంటల వరకు పని చేస్తుంటారని పేర్కొన్నారు.

ధర్నాలు జరగలేదు..
ఢిల్లీ హైకోర్టులో పని చేయడానికి వెళ్తోన్న సమయంలో- పలువురు తనను హెచ్చరించారని, ధర్నాలు, బంద్లకు సిద్ధ పడాల్సి ఉంటుందని సూచించినట్లు సీజేఐ చెప్పారు. తన హయాంలో అలాంటివేవీ చోటు చేసుకోలేదని, అదే బిగ్గెస్ట్ అఛీవ్మెంట్గా భావిస్తున్నానని ఎన్వీ రమణ చెప్పారు. ఢిల్లీవాసుల గురించి తనకు అందిన ఫీడ్బ్యాక్లాగా ఇక్కడి పరిస్థితులు లేవని అన్నారు. ఢిల్లీవాసులు సంప్రదాయబద్ధంగా, మేధావులుగా ఉంటారని, అదే సమయంలో దూకుడుగా వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications