జగన్, కేసీఆర్ కు సీజే రమణ బంపర్ ఆఫర్-వాటర్ వార్ పై మధ్యవర్తిత్వం
ఏపీ, తెలంగాణ మధ్య సాగుతున్న జల వివాదానికి పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదని అంతా భావిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ దీని పరిష్కానికి ముందుకొచ్చారు. సుప్రీంకోర్టులో న్యాయ వ్యవస్ధ ద్వారా పరిష్కారానికి బదులుగా ఇరు రాష్ట్రాలు కోరుకుంటే మధ్యవర్తిత్వం ద్వారా జలజగడం పరిష్కారానికి సిద్ధమని ఆయన ప్రతిపాదించారు. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ నిర్ణయం కీలకంగా మారింది.

ఏపీ-తెలంగాణ జల జగడం
తెలుగు రాష్ట్రాలైన ఏపీ-తెలంగాణ మధ్య గతంలో జరిగిన విభజన తర్వాత మొదలైన జల జగడాలు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిపై కేంద్రం జోక్యం చేసుకుని కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినా అంతిమ పరిష్కారం మాత్రం లభించలేదు. దీంతో ఇరు రాష్ట్రాలు కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై సైతం వాడులాడుకోవాల్సిన పరిస్దితి నెలకొంది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై పెత్తనం కేంద్రానికి వెళ్లడం తెలుగు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో దీనిపై కేంద్రం పునరాలోచించాలని ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారు.

సుప్రీంకోర్టులో ట్విస్ట్
ఏపీ-తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇరు రాష్ట్రాల నుంచి పిటిషనర్లు తమ వాదనలతో సిద్దమయ్యారు. ఈ వ్యవహారం తేల్చేందుకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ సిద్ధమైంది. అయితే అక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై విచారణ ప్రారంభించేందుకు సిద్దమైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దీంతో ఇరు రాష్ట్రాలు పునరాలోచనలో పడ్డాయి.

తీర్పు చెప్పలేనన్న సీజే రమణ
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంపై విచారణ ప్రారంభించిన జస్టిస్ ఎన్వీ రమణ ఈ కేసులో తీర్పు చెప్పేందుకు మాత్రం నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. గతంలో జల వివాదాలపై తాను న్యాయవాదిగా వ్యవహరించినందున ఈ పిటిషన్లపై తీర్పు చెప్పలేనని జస్టిస్ రమణ వెల్లడించారు. దీంతో తాను తీర్పు చెప్పలేకపోయినా ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచించేందుకు ఆయన మొగ్గు చూపారు. దీంతో ఆ పరిష్కారమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కీలకంగా మారిపోయింది

తెలుగు రాష్ట్రాలకు రమణ మధ్యవర్తిత్వం
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను సుప్రీంకోర్టులో న్యాయవ్యవస్ధ సూచించిన విధంగా పరిష్కరించేందుకు జస్టిస్ ఎన్వీరమణ మొగ్గు చూపలేదు. ఈ వివాదాలు న్యాయవ్యవస్ధ పరిధిలో కంటే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటేనే మేలని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఇరు తెలుగు రాష్ట్రాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వానికి సాయం చేస్తానని రమణ హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఏపీ, తెలంగాణ మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి ఏర్పడింది..
Recommended Video

జగన్, కేసీఆర్ ను నిర్ణయించుకోమన్న సీజే రమణ
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల జగడంపై ఇరు రాష్ట్రాలూ మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే దానికి సాయం చేసేందుకు సిద్దమని జస్టిస్ రమణ ప్రకటించారు. ఇరు రాష్ట్రాలు పిటిషన్లు ఉపసంహరించుకుని మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాద పరిష్కారానికి మొగ్గు చూపితే తాను కానీ మరో మధ్యవర్తి ద్వారా ఈ సమస్య పరిష్కరించందుకు జస్టిస్ రమణ సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇరు రాష్ట్రాలూ అంగీకరిస్తేనే మధ్యవర్తిత్వం సాధ్యమవుతుంది కాబట్టి ఇప్పుడు జగన్, కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఇరు రాష్ట్రాల భవిష్యత్తూ నిర్ణయించబోతోంది.












Click it and Unblock the Notifications