హైకోర్టు జడ్జీలకు కేసుల పరిష్కారంలో చిట్కాలు చెప్పిన భారత ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన పదిరోజులకే ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాలపై దృష్టి సారించారు. పనిదినాల్లో జడ్జీలు సెలవు పెట్టరాదని హుకూం జారీ చేశారు. ఎంతో అత్యవసరమైతే తప్ప సెలవు తీసుకోరాదని స్పష్టం చేశారు. ఇది అన్ని హైకోర్టు జడ్జీలకు, జిల్లా జడ్జీలకు వర్తిస్తుందన్నారు. జడ్జీలు సెలవుపై వెళ్లడం వల్ల చాలా కేసులు పెండింగ్లో పడిపోతున్నాయని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పెండింగ్లో 3 కోట్లు కేసులు
అక్టోబర్ 3న ఛీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టిన రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రయల్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న మూడు కోట్ల కేసులను త్వరతగతిన పరిష్కరించేందుకు చిన్న చిట్కాలు కూడా ఇచ్చారు. ఒకవారంలో హైకోర్టు కొలీజియం సభ్యులు- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరో ఇద్దరు సీనియర్ జడ్జీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసులను పెండింగ్లో ఉంచకుండా త్వరతగతిన ఎలా పరిష్కరించాలో సూచించారు. జడ్జీలు పనిదినాల్లో సెలవుపై వెళ్లరాదని చెప్పిన రంజన్ గొగోయ్.. అలా సెలవు తీసుకుని వెళ్లే వారిగురించి తనకు చెప్పాల్సిందిగా హైకోర్టు జడ్జీలను కోరారు. అయితే వారితో వ్యక్తిగతంగా తానే మాట్లాడతానని కూడా చెప్పారు.
పనిదినాల్లో ఎల్టీసీ పై యాత్రలకు వెళ్లరాదు
పనిదినాల్లో సెలవు తీసుకోకుండా పనిచేయాలన్న రంజన్ గొగోయ్... పని దినాల్లో సెమినార్లు, అధికార కార్యక్రమాలు కూడా బంద్ చేసుకుని కేవలం ఆసమయాన్ని కేసుల పరిష్కారానికే వినియోగించుకోవాలని సూచించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ చాలా కఠినంగా వ్యవహరిస్తారన్న పేరుంది. ఒక కేసుకు సంబంధించి తాను ఫ్యాక్ట్స్ మాత్రమే వింటారని వాదనల సమయంలో లాయర్లు చెప్పే కథలను ఆయన వినరని చాలామంది ఆయన్ను దగ్గరనుంచి చూసినవారు చెబుతుంటారు.
జడ్జీలతో వీడియో కాన్ఫెరెన్స్ సమావేశం తర్వాత వారందరికీ అధికారికంగా లేఖ పంపారు జస్టిస్ రంజన్ గొగోయ్. ఇక పనిదినాల్లో ఎల్టీసీ కూడా వినియోగించుకోరాదంటూ చెప్పారు. అంటే జడ్జీ కుటుంబాలు ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తే వారు చాలా ముందుగానే తమ సహజడ్జీలను ఛీఫ్ జస్టిస్లను సెలవు ఇవ్వాలంటూ కోరుతారు. ఇది ఇకపై జరగకూడదని జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీలకు ఏడాదికి మూడు ఎల్టీసీలు ఉన్నాయి. ఇక 2013-14లో అప్పటి ఛీఫ్ జస్టిస్గా ఉన్న పి. సదాశివం కోర్టు పనిదినాల్లో జడ్జీలు విదేశీయాత్రలకు వెళ్లరాదని చెప్పారు.
చాలాకాలంగా మూలన పడ్డ కేసులను ముందుగా డిస్పోజ్ చేయాలి
ఇక జడ్జీలకు, చీఫ్ జడ్జీలకు పని గురించి క్లాస్ తీసుకున్న సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కోర్టుల్లో చాలా పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని త్వరగా భర్తీ చేయాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు ఏవైతే కేసులు చాలాకాలంగా మూలనపడ్డాయో వాటిని ముందుగా లిస్ట్ అవుట్ చేసి డిస్పోస్ చేయాలని సూచించారు. ఇక కింది కోర్టుల ఆదేశాలతో జైలు శిక్ష అనుభవిస్తూ పై కోర్టులను ఆశ్రయించిన వారి కేసులను గుర్తించి పరిష్కరించాలని చెప్పారు. ఇక ఐదేళ్ల కంటే ఎక్కువగా కేసులు పెండింగ్ ఉంటే అలాంటి కేసులను ముందుగా డిస్పోజ్ చేయాలని చెప్పారు. హైకోర్టు జడ్జిగా ఒక జడ్జి పేరును సూచించేముందు అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిపేరును మాత్రమే రికమెండ్ చేయాల్సిందిగా హైకోర్టు కొలీజియం సభ్యులకు సూచించారు. ఈ క్రమంలో ఎవరి మాటలకు ప్రభావితం కాకూడదని హైకోర్టు జడ్జి, సీనియర్ జడ్జీలకు సూచించారు.