హై కమాండ్ మీద కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు, సీఎం కొడుకు అయితే పని చెయ్యాలా!
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నాయకుల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలు ఎదురు తిరగడంతో కథ రసవత్తరంగా మారింది. సీఎం కొడుకు అయితే మేము పని చెయ్యాలా అంటూ కార్యకర్తలు ఎదురుతిరిగారు.
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ప్రముఖ నటి, మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత అంబరీష్ పోటీ చేస్తున్నారు.
సుమలత అంబరీష్ కు బీజేపీ భేషరతు మద్దతు ప్రకటించింది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరపున అభ్యర్థిని పోటికి దించలేదు. సుమలతకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీ జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి తాము మద్దతు ఇవ్వమని కాంగ్రెస్ కార్యకర్తలు తేల్చి చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం ధర్మం ప్రకారం నిఖిల్ కుమారస్వామికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకుండాపోయింది.
మండ్యలో కేంద్ర మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంలో నిఖిల్ కుమారస్వామికి మనం మద్దతు ఇచ్చి ఎన్నికల్లో గెలిపించుకోవాలని నాయకులు కార్యకర్తలకు మనవి చేశారు.
మండ్యలో జేడీఎస్ నాయకులు ఆటలు ఎక్కువ అయ్యాయని, ఇంతకాలం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో గొడవలు పెట్టుకుని కోర్టుల చుట్టు తిరుగుతున్న మాకు ఇప్పుడు అదే పార్టీకి మద్దతు ఇవ్వాలని మీరు ఎలా చెబుతారని కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు. ఎలాంటి పరిస్థితుల్లో నిఖిల్ కుమార్ స్వామికి మద్దతుగా తాము పని చెయ్యమని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు షాక్ కు గురైనారు.