Online Luggage Booking: రైళ్లలో ఇక ఆన్ లైన్ లగేజ్ బుకింగ్- తాజా లిమిట్స్ ఇవే- దాటితే ఇలా..!
మన దేశంలో రైలు ప్రయాణికులకు వారి ప్రయాణం కంటే లగేజీ మోసుకుంటూ వెళ్లడమే పెద్ద పని. లగేజీని రైళ్లలో తీసుకెళ్లేందుకు సవాలక్ష ఆంక్షలు ఉంటాయి, అలాగే ఉచిత పరిమితిని మించి లగేజ్ తీసుకెళ్లాలంటే ముందుగానే రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడ లగేజ్ బుకింగ్ కౌంటర్ ను సంప్రదించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అదనపు లగేజీతో ప్రయాణాలు చేస్తే టీటీ కంటపడితే జరిమానాలు తప్పవు. ఈ కష్టాల నుంచి ప్రయాణికులకు విముక్తి కల్పించేందుకు రైల్వేశాఖ సిద్దమైంది.
కన్ఫమ్ టికెట్ల ప్రయాణికులకు ఆన్ లైన్ లగేజ్ బుకింగ్ (IRCTC)
ఇకపై కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ కలిగిన ప్రయాణికులు తమ అదనపు లగేజీని కూడా IRCTC ద్వారా ఆన్లైన్లోనే బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. ఈ కొత్త సేవ జూలై 31నుంచి అందుబాటులోకి రానుంది. ఈ కొత్త విధానంలో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే IRCTC పోర్టల్లో లగేజీ బుకింగ్ (online luggage booking) చేసుకోవచ్చు. ప్రయాణికులకు తమ ప్రయాణ తరగతికి అనుగుణంగా ఉచిత లగేజీ పరిమితి, గరిష్ఠంగా అనుమతించే బరువు, నిషేధిత వస్తువులు, అదనపు లగేజీపై వర్తించే చార్జీలు వంటి పూర్తి వివరాలు ముందే అందుబాటులో ఉంటాయి.

తరగతి వారీగా ఉచిత లగేజీ పరిమితి
ఏసీ ఫస్ట్ క్లాస్ లో 70 కిలోల వరకూ లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు. గరిష్ఠంగా 150 కిలోల వరకూ బుక్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఏసీలో ఉచితంగా 50 కిలోల వరకూ లగేజీ అనుమతిస్తారు. గరిష్ఠంగా 100 కిలోల వరకూ బుక్ చేసుకోవచ్చు. అలాగే ధర్డ్ ఏసీ, ధర్డ్ ఏసీ ఎకానమీలో, ఏసీ చైర్ కార్ లో ఉచితంగా 40 కిలోల లగేజీ తీసుకెళ్లొచ్చు. ఇందులో గరిష్ట పరిమితి కూడా ఇదే. స్లీపర్ క్లాస్ లో ఉచితంగా 40 కిలోల వరకూ తీసుకెళ్లవచ్చు, గరిష్టంగా 80 కిలోల పరిమితి ఇచ్చారు. సెకండ్ క్లాస్ లో ఉచితంగా 35 కిలోల వరకూ తీసుకెళ్లొచ్చు, అలాగే 70 కిలోల వరకూ బుక్ చేసుకునే అవకాశం ఉంది.

గరిష్ట పరిమితి దాటిన లగేజీకి ఇలా..
నిర్ణీత పరిమాణాన్ని మించిన లగేజీని కోచ్లోకి అనుమతించరు.అలాంటి సామానును తప్పనిసరిగా లగేజీ లేదా పార్సిల్ వ్యాన్ ద్వారా బుక్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడం, స్టేషన్లలో రద్దీని తగ్గించడం, కాగితపు ప్రక్రియను తగ్గించడం, రైల్వే సేవలను మరింత డిజిటల్గా మార్చడమే ఈ కొత్త ఆన్లైన్ లగేజీ బుకింగ్ సదుపాయం లక్ష్యమని భారతీయ రైల్వేలు తెలిపాయి. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందనున్నారని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications