రజినీకాంత్ కు రాష్ట్రపతి పదవి- బీజేపీ గేమ్ స్టార్ట్?
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో టీవీకే అధికారంలోకి వచ్చిన అనంతరం ఢిల్లీ స్థాయిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వస్తామని ఆశపడ్డ బీజేపీకి విజయ్ రూపంలో తీవ్ర భంగపాటు ఎదురైంది. అటు డీఎంకేకూ కాకుండా అందలాన్ని చేజిక్కించుకున్నారు విజయ్. రాజకీయాల్లో అరంగేట్రం చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఏకంగా తమిళనాడు వంటి అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ పరిణామం.. బీజేపీకి మింగుడు పడట్లేదు. మూడు దఫాలుగా కేంద్రంలో అధికారంలో ఉంటూ, బలమైన ద్రవిడ పార్టీ అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని కూడా కనీస సీట్లను గెలుచుకోలేకపోవడాన్ని అత్యంత అవమానకరంగా భావిస్తోంది. తనకు అలవాటైన రీతిలో విజయ్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేయాలనే బేసిక్ ఫార్ములాను అనుసరించాలనే నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. పశ్చిమ బెంగాల్ మాదిరి రాజకీయాలకు తెర తీసే అవకాశాలను పరిశీలిస్తోన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో.. తమకు ముందునుంచీ అనుకూలంగా ఉంటూ వస్తోన్న సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ను ప్రయోగించాలని బీజేపీ భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడంతో పాటు కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవడం, తమిళనాడులో పార్టీ రాజకీయ బాధ్యతలన్నింటినీ కూడా ఆయన చేతిలో పెట్టాలని బీజేపీ అధినాయకత్వం వ్యూహాలను రూపొదించిందని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే రజినీతో సంప్రదింపులు సైతం మొదలు పెట్టిందని తెలుస్తోంది.
మరోవంక.. రజినీకాంత్ లో కూడా అంతర్మథనం మొదలైందని టాక్ వినిపిస్తోంది. తనకంటే చాలా జూనియర్ అయిన విజయ్ ఎంత వేగంగా రాజకీయాల్లో అడుగు పెట్టారో.. అంతే వేగంగా ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం వంటి పరిణామాలు ఆయనను పునరాలోచించుకునేలా చేస్తోన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని చేజేతులా వదులుకున్నాననే భావన ఆయనలో బలంగా వ్యక్తమవుతోందనేది బహిరంగ రహస్యమే.
ఈ నేపథ్యంలో విజయ్ ను ఎదుర్కొనడానికి రజినీకాంత్ అనే అస్త్రాన్ని సంధించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని అంటున్నారు. ఆయనను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి విజయ్ హవాకు అడ్డుకట్ట వేయాలని ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రజినీకాంత్ ను ఒప్పించే బాధ్యతలను ఇదివరకే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఆడిటర్ గురుమూర్తికి అప్పగించిందనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది.
ఇదిలావుండగా.. కేంద్రమంత్రి పదవిపై రజినీకాంత్ కు పెద్దగా ఆశలేదని, రాజ్యాంగబద్ధ పదవి కోసం ఆయన తనవంతు బేరసారాలు మొదలు పెట్టారనీ అంటున్నారు. తనకు ఇస్తే ఉపరాష్ట్రపతి లేదా రాష్ట్రపతి పదవి ఇవ్వాలని, కేంద్ర మంత్రి పదవిని అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన సన్నిహిత చర్చల్లో స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చే జూన్ నాటికి ద్రౌపది ముర్ము పదవీ కాలం పూర్తి కానుండటంతో, దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని దక్కించుకోవాలనే ఆలోచనలో రజినీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications