చంద్రబాబు, పవన్ సమర్థతకు మోదీ పరీక్ష..!!
ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ భాగస్వాములుగా ఉన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ, జనసేన అధినేతలు ఇప్పుడు బీజేపీకి మద్దతుగా రంగంలోకి దిగారు. జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న వేళ ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం కోసం చంద్రబాబు, పవన్ బాధ్యత తీసుకున్నారు. అయితే, వీరిద్దరూ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఏ మేర ప్రభావితం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ మహారాష్ట్ర వెళ్తున్నారు. చంద్రబాబు ఈ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లి అక్కడ నుంచి మహారాష్ట్ర వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ప్రచారంలో పాల్గొనే లా షెడ్యూల్ ఫిక్స్ అయింది. పవన్ సైతం రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. బీజేపీ కూటమి కి మద్దతుగా ఇద్దరూ ప్రచారంలో పాల్గొంటారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల్లో ఈ ఇద్దరి ప్రచారానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబాయి నగరంలో శివసేన (ఉద్దవ్)- బీజేపీ పార్టీల మధ్య హోరా హోరీ పోరు ఉంది. తెలుగు ప్రజలు ముంబాయిలో ప్రభావితం చేసే నియోజకవర్గాల్లో పవన్ కు ప్రచార బాధ్యతలు కేటాయించారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి చంద్రబాబు, పవన్ ప్రచారం చేయనున్నారు.

గతంలో తెలంగాణలోనూ ఎన్డీఏకు అనుకూలంగా పవన్ ప్రచారం చేసారు. కానీ, ఫలితాల్లో మాత్రం పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఫలితాలు సానుకూలంగా రాలేదు. హైదరాబాద్ లో పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ ఎన్నికలకు టీడీపీ దూరం పాటించింది. తమిళనాడులో లోక్ సభ ఎన్నికల సమయంలో అక్కడ అన్నామలైకు మద్దతుగా లోకేష్ ప్రచారం చేసారు. గతంలో కర్ణాటకలోనూ బీజేపీ కోసం పవన్ ప్రచారం నిర్వహించారు. ఇక, తాజాగా పవన్ సనాతన ధర్మం పేరుతో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఇప్పుడు కూటమి భాగస్వామ్య పక్షాల నేతలుగా చంద్రబాబు, పవన్ ప్రచారానికి ఎలాంటి స్పందన ఉంటుంది... ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications