డ్రామాలు వద్దు, మన్నార్ గుడి గ్యాంగ్ నుంచి బయటకు రా: పన్నీర్ సెల్వం !
చెన్నై: గుట్టు చప్పుడు కాకుండా జైల్లో ఉన్న శశికళతో మంతనాలు జరుపుతూ బయటకు మాత్రం విలీనానికి తాము సిద్దం అంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గం మాటలు మేము నమ్మమని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు.
అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను వెలివేశామని ఇప్పటి వరకూ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఒక్క సారి కూడా నోరు తెరచి చెప్పలేదని పన్నీర్ సెల్వం మండిపడ్డారు. అలాంటి సమయంలో తాము విలీనానికి సిద్దం అని ఎలా ముందుకు వస్తామని పన్నీర్ సెల్వం అన్నారు.
టీటీవీ దినకరన్ కొంత మంది ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్టాడుతున్నారని ఇదే సమయంలో పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. అయినా నిమ్మకు నిరేత్తినట్లు ఎడప్పాడి పళనిస్వామి చోద్యం చూస్తున్నారానే కాని ఆ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఎడప్పాడి పళనిస్వామి ముందు మన్నార్ గుడి గ్యాంగ్ నుంచి బయటకు వస్తే తరువాత విలీనం చర్చల గురించి ఆలోచిస్తామని పన్నీర్ సెల్వం అన్నారు. పళనిస్వామి మ్యాజిక్ లు మా ముందు పని చెయ్యవని, అవన్నీ మన్నార్గుడి గ్యాంగ్ ముందు ప్రదర్శించుకుంటే బాగుంటుందని పన్నీర్ సెల్వం ఎద్దేవ చేశారు.