కావేరీ తీర్పు, తమిళనాడులో అఖిలపక్ష సమావేశం, 35 పార్టీలు, కమల్, దినకరన్ కు చెక్!
చెన్నై: కావేరీ నీటి వివాదం విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఏం చెద్దాం అని తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలు చర్చలు మొదలుపెట్టాయి. గురువారం చెన్నైలోని సెక్రటేరియట్ లో అఖలిపక్ష సమావేశం (ఆల్ పార్టీ మీటింగ్) లో కావేరీ నీటి పంపిణి విషయంలో చర్చలు మొదలు పెట్టి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అయితే అఖిల పక్ష సమావేశానికి హీరో కమల్ హాసన్, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ను తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించలేదు.
ప్రధాన ప్రతిపక్షం
కావేరీ నీటి పంపిణి విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తమిళనాడు రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగిందని, ఈ విషయంలో న్యాయం జరిగే వరకూ పోరాడటానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎం పళనిప్వామి ఓకే
ఫిబ్రవరి 22వ తేదీ గురువారం మద్యాహ్నం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, అందరూ హాజరుకావాలని సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించారు. గురువారం మద్యాహ్నం సెక్రటేరియట్ లోని నమ్మక్కల్ కవిగనర్ మలింగై భవనంలో అఖిల పక్ష సమావేశం మొదలైయ్యింది.
ద్రవిడ, జాతీయ పార్టీలు
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే నుంచి ఎంకే. స్టాలిన్, దురైమురుగన్, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ అద్యక్షుడు తిరునావుక్కరసర్, అసెంబ్లీలో ఆపార్టీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే బీజేపీ అధ్యక్షురాలు తమిళసై సౌందరరాజన్ హాజరైనారు.
35 పార్టీలు, 14 రైతు సంఘాలు
తమిళనాడులో 35 రాజకీయ పార్టీల నాయకులు, 14 రైతు సంఘాల ప్రతినిధులు అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. కావేరీ డెల్టా ప్రాంతాలకు చెందిన మంత్రులు ఆర్. కామరాజ్, ఓఎస్, మణియన్, దొరకన్ను అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు.
సీఎం, స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాన పత్రిపక్షం డీఎంకేతో సహ ద్రవిడ, జాతీయ పార్టీల నాయకులు అభిప్రాయాలు తెలుసుకున్న తరువాత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది.
కమల్ హాసన్ క్లారిటి
హీరో కమల్ హాసన్ బుధవారం కొత్త రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. గురువారం మదురైలో మీడియాతో మాట్లాడిన హీరో కమల్ హాసన్ కావేరీ నది జాలాల పంపిణి విషయంలో జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి తనకు ఆహ్వానం లేదని చెప్పారు బహుషా తనను రాజకీయ పార్టీ నాయకుడిగా తమిళనాడు ప్రభుత్వం గుర్తించినట్లు లేదని పరోక్షంగా ఎద్దేవ చేశారు.
టీటీవీ దినకరన్ కు చెక్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశానికి ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ను ఆహ్వానించలేదు. ఈ విషయంపై టీటీవీ దినకరన్ మీడియా ప్రశ్నించగా తనను సమావేశానికి ఆహ్వానించారని, లేదని అనే సమాధానం చెప్పకుండా వేరే విషయాలు మాట్లాడారు.