అదరం.. బెదరం, కేంద్రంతో కేసీఆర్ తీరు సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపును టీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఇప్పుడు దాన్ని పెను సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం రా రైస్, బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్రం చెబుతోందని, రైతులకు కేంద్రం అన్యాయం చేయదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంపై కేసీఆర్ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ తీరు చూస్తుంటే కిసాన్ బచావో అన్నట్టుగా లేదు, కేసీఆర్ బచావో అన్నట్టుగా ఉందని కామెంట్ చేశారు.
ఇదీ తగదు..
రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తోందని, రైతుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేసే చర్యలు వద్దని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు, టీఆర్ఎస్కు భయపడం అన్నారు. బీజేపీపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు.
లేని సమస్య తెరపైకి
హుజూరాబాద్ ఓటమి నుంచి బయట పడేందుకు లేని సమస్యను సృష్టించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ముందే ఒప్పందాలు చేసుకొని మళ్లీ సమస్య సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు మేము ఎప్పుడు నష్టం చేయమని స్పష్టంచేశారు. ఈ సీజన్లో వచ్చే ప్రతి గింజ కొంటామని మరోసారి స్పష్టంచేశారు. కొనడానికి సిద్ధంగా ఉన్నా, 17 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వలేదన్నారు. ధర్నాలు చేసే బదులు వరి ధాన్యం సేకరించాలని సూచించారు.
Recommended Video
ఆ పథకం రద్దు చేస్తారా..?
ధాన్యం కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం బాధ్యత రహితం అని మండిపడ్డారు. ధాన్యం సేకరించకుంటే ఒక రూపాయికి కిలో బియ్యం పథకాన్ని మీరు రద్దు చేస్తారా? అని అడిగారు. రబీలో ముడిబియ్యం తీసుకుంటా మని.. బియ్యం ఎంత తీసుకుంటామనేది ఫిబ్రవరిలో నిర్ణయిస్తామని చెప్పారు. వానాకాలంలో ప్రతి ధాన్యం గింజ కొంటామని కిషన్రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. యాసంగిలో వరి పంట కొనగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి కిషన్ రెడ్డి స్పందించారు.