గొప్ప విజయం: మోడీపై ఒమర్, అందుకేనని ముఫ్తీ ఆగ్రహం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ప్రశంసలు కురిపించారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇతర దేశాలతో సంబంధాలు పెంపొందించుకుంటున్న విధానం, వ్యవహరిస్తున్న తీరు చాలా బాగుందన్నారు.
పొరుగు దేశాలకు వెంటవెంటనే వెళ్తూ మంచి పని చేస్తున్నారన్నారు. దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను భారత్కు రప్పిస్తుండడం ఆయన సాధించిన పెద్ద విజయమని అభివర్ణించారు. అదే సమయంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ మోడీ నెరవేర్చాలన్నారు.
మండిపడ్డ మెహబూబా ముఫ్తీ
ప్రధాని నరేంద్ర మోడీ పట్ల ప్రశంసలు కురిపించిన ఒమర్ అబ్దుల్లా పైన పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఒమర్ అబ్దుల్లా, ఆయన నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎవరితోనైనా చేతులు కలుపుతుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తమకు సీట్లు తక్కువగా వస్తే బీజేపీతో జతకట్టే యోచనలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉందా అనే చర్చ సాగుతోంది.
ప్రస్తుతం జమ్ము కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల నుండి పోటీ బడ్గం జిల్లాలోని బీర్వా నియోజకవర్గం, శ్రీనగర్ జిల్లాలోని సోనావార్ నియోజకవర్గాల నుండి ఒమర్ పోటీ చేస్తున్నారు.
రాష్ట్రానికి చెందిన రెండు పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీల పరిస్థితి ఈసారి డూ ఆర్ డై అన్న చందంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బాగా పుంజుకోవడంతో.. ఆ పార్టీలు మేజిక్ ఫిగర్ దాటే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ప్రధానిని పొగడం గమనార్హం.