CMIE report: నిరుద్యోగితపై సంచలన నివేదిక: ఏపీ-తెలంగాణల్లో ఇలా
న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపుతామని, 10 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొన్నటికి మొన్న ఓ ప్రకటన జారీ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్నుంచి గట్టెక్కడానికి ఇబ్బడి ముబ్బడిగా జీఎస్టీనీ విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదివరకెప్పుడూ లేనివిధంగా చివరికి బియ్యం, గోధుమలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చింది. జీఎస్టీ దెబ్బకు పలు చిన్నతరహా పరిశ్రమలు సైతం మూతపడే దశకు చేరుకుంటోన్నాయి.
ఈ పరిణామాలన్నింటినీ ప్రతిబింబించేలా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఓ నివేదిక విడుదల చేసింది. ఏఏ రాష్ట్రంలో నిరుద్యోగిత శాతం ఎలా ఉందనే విషయాన్ని ఇందులో పొందుపరిచింది. కరోనా వైరస్ వల్ల రెండు సంవత్సరాలుగా వేలాదిమంది కార్మికులు ఉపాధి అవకాశాలను కోల్పోయారనే అంశాన్ని ప్రస్తావించింది. ఈ సంవత్సరం జూన్లో నమోదైన నిరుద్యోగిత శాతాన్ని రికార్డు చేసింది. దీన్ని విడుదల చేసింది.
దీని ప్రకారం చూస్తే- నిరుద్యోగిత శాతంలో హర్యానా, రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచాయి. హర్యానా-30.6, రాజస్థాన్-29.8 శాతం మేర నిరుద్యోగిత శాతాన్ని నమోదు చేశాయి. వాటితో పోల్చుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగ పరిస్థితులు భారీగా తగ్గినట్టే. ఏపీలో నిరుద్యోగ శాతం 4.4గా నమోదైంది. తెలంగాణలో ఈ సంఖ్య కాస్త ఎక్కువే. అక్కడ 10 శాతం ఉంటోంది.
అస్సాం-17.2, జమ్మూ కాశ్మీర్-17.2, బిహార్-14, సిక్కిం-12.7, జార్ఖండ్-12.2, ఢిల్లీ-10.3, హిమాచల్ ప్రదేశ్-10.3, తెలంగాణ-10, త్రిపుర-9.4, ఉత్తరాఖండ్-8.7, పంజాబ్-8.5, గోవా-5.5, కేరళ-5.3, పశ్చిమబెంగాల్-5.2, మహారాష్ట్ర-4.8, ఆంధ్రప్రదేశ్-4.4, కర్ణాటక-3.7, గుజరాత్-3, ఉత్తర ప్రదేశ్-2.8, మేఘాలయ-2.3, తమిళనాడు-2.1, ఛత్తీస్గఢ్-1.2, ఒడిశా-1.2, పుదుచ్చేరి-0.8, మధ్యప్రదేశ్-0.5 శాతంగా నిరుద్యోగ శాతం రికార్డయింది.