దేశంలో బొగ్గు సంక్షోభం అసలు లేదట..అదంతా అబద్ధమట: నిర్మలమ్మ స్టేట్మెంట్
న్యూఢిల్లీ: బొగ్గు సంక్షోభం ప్రస్తుతం దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోంది. ఇదివరకెప్పుడూ లేనంతంగా బొగ్గు కొరత ఏర్పడటం వల్ల థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మందగించింది. భారీ వర్షాల వల్ల బొగ్గు వెలికితీత ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. చాలా చోట్ల బొగ్గు గనుల్లో వరదనీరు చేరుకుంది. దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం నెలకొంది. విజయవాడలోని డాక్టర్ నార్ల తాతారావు, కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నామమాత్రంగా సాగుతోంది. కర్ణాటకలోని రాయచూర్ థర్మల్ కేంద్రంలో ఇదే పరిస్థితి ఏర్పడింది.
దేశంలో బొగ్గు సంక్షోభం తలెత్తిందంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తోసిపుచ్చారు. బొగ్గు సంక్షోభం అనేది అసలు లేనే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. పైగా దేశంలో మిగులు విద్యుత్ ఉందని పేర్కొన్నారు. థర్మల్ కేంద్రాలకు చాలినంత బొగ్గు అందకపోవడం వల్ల విద్యుత్ ఉత్పత్తి మందగించిందంటూ వస్తోన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు.
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉండొచ్చని చెప్పారు. డిమాండ్ అండ్ సప్లై మధ్య నెలకొన్న ఆంతరం వల్ల విద్యుత్ కొరత ఏర్పడి ఉండొచ్చని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ ఉత్పాదక కేంద్రాల్లో చాలినన్ని బొగ్గు నిల్వలు ఉన్నాయని అన్నారు. కనీసం నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన బొగ్గు నిల్వలు థర్మల్ కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
బొగ్గు సరఫరా వ్యవస్థ అనేది ఎక్కడా దెబ్బతినలేదని, సజావుగా సాగుతోందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని బోస్టన్ హార్వర్డ్ కెనడి స్కూల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఇక విద్యుత్ కొరత కూడా దేశంలో లేదని స్పష్టం చేశారు. పైగా భారత్ మిగులు విద్యుత్ను సాధించిన దేశమని పేర్కొన్నారు. సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా డిమాండ్కు అనుగుణంగా భారత్లో విద్యుత్ ఉత్పత్తి సాగుతోందని నిర్మల సీతారామన్ అన్నారు.
Recommended Video
ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి దేశంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోందని నిర్మల సీతారామన్ అన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారి సంఖ్య త్వరలోనే వందకోట్లకు చేరుకుంటుందని చెప్పారు. వ్యాక్సిన్ను తమ ప్రభుత్వం దేశ ప్రజలకు ఉచితంగా అందిస్తోందని గుర్తు చేశారు. మరిన్ని వ్యాక్సిన్లు త్వరలోనే ఈ కార్యక్రమంలోకి చేరుతాయని, దీనికి అవసరమైన చర్యలన్నింటినీ తీసుకున్నామని నిర్మల సీతారామన్ చెప్పారు. పోలియోను భారత్ విజయవంతంగా నిర్మూలించిందని అన్నారు. మలేరియా వంటి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు.