Coal Shortage In India: దేశంలో బొగ్గు కొరత; విద్యుత్ సంక్షోభంపై ఆందోళన; నేడు ప్రధాని మోడీ సమీక్ష!!
భారతదేశంలో బొగ్గు కొరత కారణంగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొంటుందని పలు రాష్ట్రాల ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశానికి బొగ్గు కొరత ప్రధానమైన సమస్యగా మారింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కార్యాలయం నేడు భారతదేశంలో బొగ్గు సరఫరా పరిస్థితిని సమీక్షించే అవకాశం ఉందని సమాచారం. సోమవారం, హోం మంత్రి అమిత్ షా బొగ్గు మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖల మంత్రులు ప్రహ్లాద్ జోషి మరియు ఆర్కె సింగ్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత, ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి చేయవలసిన దానిపై చర్చలు జరిపారు.
బొగ్గు కొరతపై నేడు ప్రధాని మోడీ సమీక్ష
విద్యుత్ సంక్షోభంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ప్రస్తుతం విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి, బొగ్గు కొరతను నివారించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా తాజా బొగ్గు కొరత పరిస్థితులపై మోడీ సమీక్షించనున్నారని తెలుస్తుంది. విద్యుత్ ప్లాంట్ల డిమాండ్లను తీర్చడానికి తగినంత బొగ్గు నిల్వలను ఇస్తామని కేంద్రం ఇప్పటికే దేశానికి భరోసా ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్ కోతలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు మొత్తం దేశంలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని అన్నారు.
ధర్మల్ ప్లాంట్స్ లో తీవ్ర బొగ్గు కొరత ... మోడీకి లేఖలు
ఇప్పటికే దేశవ్యాప్తంగా ధర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశంలో థర్మల్ ప్లాంట్లలో ఉన్న బొగ్గు కొరతను ఢిల్లీతో పాటు ఉన్న మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తదితర రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళాయి. పలువురు ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం విద్యుత్ సంక్షోభం ఏర్పడబోదని, అనవసరపు భయాందోళనలకు స్వస్తి పలకాలని, బొగ్గు కొరత ఉన్న మాట వాస్తవమేనని, దానిని కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది.
బొగ్గు కొరత, విద్యుత్ సంక్షోభంపై కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ మాట్లాడుతూ "బొగ్గు కొరత గురించి అనవసరంగా భయాందోళనలు సృష్టించబడ్డాయని పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు రాబోయే కొద్ది రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. దేశానికి కావాల్సిన విద్యుత్ అందుబాటులో ఉందని, ఏ రాష్ట్రానికి విద్యుత్ కావాలో చెప్తే అందిస్తామంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు . ఇదిలా ఉంటే మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాలు విద్యుత్ కొరతపై ఆందోళన వ్యక్తం చేశాయి.
Recommended Video
బొగ్గు కొరతపై సోమవారం అమిత్ షా సమావేశం,నేడు ప్రధాని మోడీ భేటీ !
చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ బొగ్గు సంక్షోభం లేదని చెప్పినందుకు కేంద్రం తీరుపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా విద్యుత్ ప్లాంట్లు ఎందుకు మూతబడుతున్నాయని ప్రశ్నించారు. బొగ్గు కొరత లేదని కేంద్రం చెబుతోంది కానీ పవర్ ప్లాంట్లు మూతపడుతున్నాయి . ఎందుకు కేంద్రం తప్పుడు వాదనలు చేస్తోంది, బొగ్గు దిగుమతి కూడా ఆగిపోయింది. ఇది విద్యుత్ సరఫరాపై ప్రభావం చూపుతుంది ... కేంద్రం ఏమి చేస్తోంది? అంటూ భూపేష్ బాగెల్ సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే పలువురు బిజెపియేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పీఎం మోడీ, బిజెపి సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బొగ్గు నిల్వలపై కీలక భేటీ నిర్వహించి బొగ్గు నిల్వలు, విద్యుత్ సరఫరా, డిమాండ్ తదితర అంశాలపై చర్చించారు