ప్రైవేట్ స్కూల్ నరకమే: తుమ్మితే రూ.200, మాతృభాష మాట్లాడితే రూ.300 ఫైన్, టాయ్లెట్లు కడిగిస్తున్నారు!
ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఆంగ్ల మాధ్యమం పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నాయి. తాజాగా, తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు పాఠశాల దుశ్చర్యలు వెలుగుచూశాయి.
చెన్నై: ప్రైవేటు పాఠశాలల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. ఆంగ్ల మాధ్యమం పేరుతో విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నాయి. తాజాగా, తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఓ ప్రైవేటు పాఠశాల దుశ్చర్యలు వెలుగుచూశాయి.

తుమ్మితే రూ.200, తమిళ్ మాట్లాడితే రూ.300
విద్యార్థులు తుమ్మితే రూ.200, తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధిస్తున్న సదరు ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై 9వ తరగతి విద్యార్థిని మంగళవారం కోయంబత్తూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది.

ఆకృత్యాలు అన్నీఇన్నీకావు..
విద్యార్థిని లక్ష్మీ తన తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్కు వచ్చి కోయంబత్తూరు జిల్లా సెట్టిపాళయంలోని పాఠశాలలో జరుగుతున్న అకృత్యాలను వివరించింది. విద్యార్థులెవరైనా తుమ్మితే తమ పీటీ మాస్టర్ రూ.200 జరిమానా విధిస్తున్నాడని, ఒకటి కంటే ఎక్కువసార్లు తుమ్మితే పాఠశాల మైదానమంతా పరుగులు పెట్టిస్తున్నాడని తెలిపింది.

మరుగుదొడ్లు కూడా కడిగిస్తున్నారు..
అంతేగాక, తమిళంలో మాట్లాడితే రూ.300 జరిమానా విధిస్తున్నారని, ఒకటి కంటే ఎక్కువ సార్లు అలా జరిమానా కట్టిన విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తున్నారంటూ కన్నీటి పర్యాంతమైంది. జరిమానా కట్టకపోతే పాఠశాల మైదానం చుట్టూ పదిసార్లు పరుగు పెట్టిస్తున్నారని వాపోయింది.

టీసీ అడిగితే రూ. 15వేలు..
ఇంటి నుంచి తీసుకొచ్చిన నీళ్లు తాగొద్దంటున్నారని, పాఠశాల ట్యాంకులోని మురికి నీరే తాగాలని ఆదేశిస్తున్నారని పేర్కొంది. ఈ వేధింపులతో విసిగిపోయిన విద్యార్థులు ఎవరైనా టీసీ అడిగితే రూ.15 వేలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పాఠశాలలోని విద్యార్థులందరికి యాజమాన్యం నరకం చూపిస్తోందని వాపోయింది. సదరు విద్యార్థిని ఫిర్యాదుతో స్పందించిన కలెక్టర్ ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications