చైనా రివర్స్ గేర్: ఇండియానే వెనక్కెళ్లాలని డిమాండ్ - అసంపూర్తిగా ముగిసిన చర్చలు - తర్వాత ఏంటి?
అర్దరాత్రి దొంగచాటుగా వచ్చి.. సరిహద్దుల్ని మార్చేసే ప్రయత్నం చేసిందేకాక.. తిరిగి ఇండియాపైనే నెపం మోపింది చైనా. ఉద్రిక్తతల నివారణ కోసం సోమవారం జరిగిన చర్చల్లో డ్రాగన్ తనకు బాగా అలవాటైన రివర్స్ గేర్ సిద్ధాంతాన్నే అనుసరించింది. తాను గీత దాటలేదని బుకాయించడమేకాదు.. భారత జవాన్లే మా భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేశారని ఆరోపించింది. చైనా అడ్డగోలు వాదనతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
Recommended Video
చైనా మరో దుశ్చర్య: హిందువులకు పవిత్రమైన కైలాస మానసరోవరంలో మిస్సైల్ లాంఛర్లు - టెన్షన్
గడిచిన నాలుగు నెలలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారీగా మోహరించిన చైనా బలగాలు.. తూర్పు లదాక్ లోని వివిధ ప్రాంతాల్లో అలజడికి ప్రయత్నిస్తున్నాయి. గతంలో తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణ జరగడం తెలిసిందే. తాజాగా ఇదే తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సుకు దక్షిణంగా ఉండే చుశూల్ సెక్టార్, స్పాన్గుర్ గ్యాప్ ప్రాంతాల్లో సరిహద్దుల్ని చెరిపేసి, తద్వారా ఆక్రమణకు చైనా సైన్యం ప్రయత్నించగా భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈనెల 29-30 రాత్రి చోటుచేసుకున్న సంఘటనలపై భారత సైన్యం ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది. అంతేకాదు,
చైనా దుశ్చర్యను ఎండగట్టిన భారత సైన్యం.. మరోవైపు శాంతి చర్చలు కూడా జరపడం గమనార్హం. తాజా ఉద్రిక్తతకు వేదికైన చుశూల్ సెక్టార్ లోనే భారత్, చైనా ఆర్మీ బ్రిగేడ్ కమాండర్ల స్థాయిలో సోమవారం చర్చలు జరిగాయి. తూర్పు లదాక్ లో ఉద్రిక్తతలు తొలగిపోయేలా, మొత్తంగా ఎల్ఏసీ వెంట ఏప్రిల్ నాటి స్టేటస్ కో(యధాస్థితి) నెలకొనేలా ముందుకెళదామని భారత్ ప్రతిపాదించగా, చైనా మాత్రం రివర్స్ గేర్ లో మనపైనే ఆరోపణలు చేసింది.
ఎల్ఏసీ వెంబడి పలు చోట్ల భారత బలగాలు గీతదాటి చైనా భూభాగంలోకి ప్రవేశించాయని, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు సరికాదని, భారత సైన్యం వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని చైనీస్ ఆర్మీ డిమాండ్ చేసింది. సరిగ్గా చుశూల్ లో చర్చలు ముగిసిన కొద్దిసేపటికే.. పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ జాంగ్ షులి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. సరిహద్దులో ఉల్లంఘనలకు పాల్పడుతోన్న ఇండియా.. ఆ నెపాన్ని చైనాపైకి నెడుతోందని, ఉద్రిక్తతల్ని పెంచే ఇలాంటి చర్యలు మానుకోవాలని చైనా పేర్కొంది.
సరిహద్దులో ఉద్రిక్తతకు ఇండియానే కారణమంటూ మొదటి నుంచీ వాదిస్తోన్న చైనా.. సోమవారం చుశూల్ లో జరిగిన భేటీలోనూ అవే మాటల్ని వల్లెవేసింది. అయితే, పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి ప్రరకటనపై భారత బలగాలు ఇంకా స్పందించాల్సిఉంది. మొత్తంగా సోమవారం నాటి చర్చలు అసంపూర్తిగా ముగియడంతో, మంగళ లేదా బుధవారాల్లో మరో దఫాచర్చలు జరుగుతాయని సమాచారం. వరుసగా ఉల్లంఘనలకు పాల్పడుతోన్న చైనాకు ఏ విధంగా ముకుతాడు వేయాలనేదానిపై ఇటు ఢిల్లీలోనూ కేంద్రం మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.