వంటగ్యాస్ సిలిండర్పై రూ.103 పెంపు: ధరల మోత మోగిస్తోన్న మోడీ సర్కార్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం మరోసారి ధరల మోత మోగించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఒక్కో వంటగ్యాస్ సిలిండర్ రేటును రూ.103.50 పైసలకు పెంచింది. ఈ కేటగిరీకి చెందిన ఎల్పీజీ వంటగ్యాస్ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. కిందటి నెల 1వ తేదీన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై 266 రూపాయలను పెంచింది. ఈ నెల మరో రూ.103.50 పైసల భారాన్ని మోపింది.

కమర్షియల్ సిలిండర్ల రేటు ఇలా..
గృహావసర వినియోగదారులకు తాజా భారం నుంచి మినహాయింపు ఇచ్చింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల రేట్లను యధాతథంగా కొనసాగిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లను వినియోగిస్తుంటారు. ఈ పెంచిన రేట్లను వాటికి మాత్రమే వర్తింపజేసింది. అలాంటి వంటగ్యాస్ కనెక్షన్లపై మాత్రమే ఈ భారాన్ని మోపింది. పెంచిన రేట్లు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.

రెండు నెలల్లో 369 రూపాయలా?
ఈ రెండు నెలల వ్యవధిలోనే మోడీ సర్కార్.. 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్పై మోపిన భారం రూ. 369.50 పైసలు. తాజా పెంపుతో- కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర 2,000 రూపాయలను దాటేసింది. దేశ రాజధానిలో ఒక్కో సిలిండర్ రేటు రూ.2,104 రూపాయలకు చేరింది. మంగళవారం వరకూ ఉన్న ధర రూ.2,000.50 పైసలు. తెల్లవారే సరికి ఈ ధర రూ.2,104కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1,950 రూపాయలు ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ ధర.. ఇప్పుడు 2,051 రూపాయలకు చేరింది.

చెన్నైలో అత్యధికంగా..
కోల్కతలో దీని రేటు 2,073.50 పైసల నుంచి 2,174కు పెరిగింది. చెన్నైలో అత్యధికంగా రూ.2,234.50 పైసలుగా నమోదైంది. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల జోలికి మాత్రం వెళ్లలేదు. వాటి రేట్లల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. యధాతథంగా కొనసాగిస్తోంది. 14.2 కేజీల బరువు ఉండే గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్లో పాత రేటే కొనసాగుతోంది. డొమెస్టిక్ కేటగిరీలోని ఎల్పీజీ సిిలిండర్ ధర రూ.899.50 పైసలుగా ఉంది. కోల్కతలో 926 రూపాయలు, చెన్నైలో రూ.915.50 పైసలుగా ఉంటోంది.

జనవరిలో రూ.694 నుంచి..
ఈ ఏడాది మొదట్లో 694 రూపాయలు పలికిన గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ రేటు.. ఇప్పుడు 900 రూపాయల మార్క్ను దాటింది. దీపావళి తరువాత వెయ్యి రూపాయలను అధిగమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ నెల 6వ తేదీన డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల ధరలను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 300 రూపాయలకు పైగా గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల మీద భారం పడింది. ఇది మరింత పెరిగుతుందని, మొత్తంగా 1,000 రూపాయల మార్క్ దాటడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు.

హోటళ్ల పరిస్థితేంటీ?
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల మనుగడ తలకిందులైంది. కమర్షియల్ వంటగ్యాస్ను వినియోగించే చిరు వ్యాపారులు ఇప్పటికే అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నారు. దీనికితోడు తాజాగా వారు వినియోగించే సిలిండర్ల ధర పెరగడం అనేది- వారి వ్యాపారాన్ని మరింత దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. పెరిగిన వంటగ్యాస్ ధరకు అనుగుణంగా వారు తమ రేట్లను కూడా పెంచితే మధ్య తరగతి కుటుంబీకులు చిరుతిళ్లను కొనుక్కుని తినలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. బిజినెస్ సైకిల్పై ఇది దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications