నేను రాను బాబోయ్! సీజేఐపై కుట్ర కేసులో మరో వివాదానికి తెరతీసిన మహిళ
ఢిల్లీ : సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రోజుకో కొత్త పరిమాణం చోటు చేసుకుంటోంది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ ముమ్మరం కాగా... తాజాగా సీజేఐపై ఫిర్యాదు చేసిన మహిళ మరో బాంబు పేల్చారు. త్రిసభ్య కమిటీ విచారణకు హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఇన్హౌస్ ఎంక్వైరీ విధానాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
సీజేఐపై కుట్రలో ప్రశాంత్ భూషణ్ హస్తం!?
న్యాయం జరగుతుందన్న నమ్మకం లేదు
ఇన్హౌస్ కమిటీ నిబంధనలను పరిశీలిస్తే.. భయానక, ఆందోళనకర వాతావరణంలో దర్యాప్తు జరుగుతుందన్న విషయం అర్థమవుతోందని సదరు మహిళ ఆరోపించారు. లాయర్ సాయం లేకుండా ముగ్గురు న్యాయమూర్తుల ఎదుట హాజరుకావడం తనను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. అసలు త్రిసభ్య కమిటీ విచారణ వల్ల తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని స్పష్టం చేశారు.
నిర్ణయానికి నాలుగు కారణాలు
విచారణకు గైర్హాజరు కావాలన్న తన నిర్ణయానికి సదరు మహిళ నాలుగు కారణాలు చెప్పారు. తనకు చెవుడు ఉన్నప్పటికీ తోడుగా లాయర్ను గానీ మరో వ్యక్తిని గానీ అనుమతించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇక త్రిసభ్య కమిటీ విచారణకు సంబంధించిన అంశాలను ఆడియో లేదా వీడియో రూపంలో రికార్డు చేయకపోవడం, ఏప్రిల్ 26, 29 తేదీల్లో రికార్డు చేసిన స్టేట్మెంట్ కాపీలను తనకు ఇవ్వకపోవడంపై సీజేఐపై ఆరోపణలు చేసిన మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణలో కమిటీ అనుసరించే విధివిధానాల గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం కూడా తన నిర్ణయానికి కారణమని స్పష్టం చేశారు.
ఉద్యోగులే సాక్ష్యులు
తనపై చీఫ్ జస్టిస్ లైంగిక వేధింపులకు సంబంధించి కోర్టు ఉద్యోగులే సాక్ష్యులని ఆరోపణలు చేసిన మహిళ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారెవరూ నిర్భయంగా కమిటీ ముందు సాక్ష్యం చెబుతారని తాను అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. విశాఖ గైడ్లైన్స్ పాటించాలన్న తన అభ్యర్థనను త్రిసభ్య కమిటీ పట్టించుకోకపోవడంపై సదరు మహిళ అసంతృప్తి వ్యక్తం చేశారు.