లోన్ మారటోరియం, ఈఎంఐ వడ్డీలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: కేంద్రాన్ని ఆదేశించలేం
న్యూఢిల్లీ: రుణాల మారటోరియంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వినిపించింది. లోన్ మారటోరియంపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో- రుణ మారటోరియం కాలాన్ని పొడిగించలేమని కూడా తెలిపింది. ఆర్ధిక ప్యాకేజీలు, ఉపశమనాలు, ఉద్దీపనలను ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని పేర్కొంది. మారటోరియం కాలాన్ని పొడిగించేలా ఆదేశాలను జారీ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ను విధించిన సమయంలో రిజర్వుబ్యాంకు మారటోరియాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు దశల్లో దాన్ని అమలు చేసింది. తొలుత- గత ఏడాది మార్చి 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు మూడు నెలల కాలాన్ని మారటోరియంగా ప్రకటించింది. ఈ మేరకు మార్చి 27వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. అనంతరం మే 31వ తేదీన ముగియాల్సిన మారటోరియం కాలాన్ని మళ్లీ పొడిగించింది. మరో మూడు నెలలు దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగింపజేసింది.

ఈ ఆరునెలల మారటోరియం కాలంలో ఈఎంఐలపై చెల్లించాల్సిన వడ్డీని మాఫీ చేసేలా, మారటోరియం కాలాన్ని మరి కొంతకాలం పాటు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్పై సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇదివరకే విచారణలను ముగించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాషణ్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ఈ బెంచ్.. కొద్దిసేపటి కిందటే తీర్పు వినిపించింది. ఈఎంఐలపై పూర్తి వడ్డీని మాఫీ చేయడం సాధ్యం కాదని పేర్కొంది.
డిపాజిట్దారులు భద్రపరచుకున్న నగదుకు బ్యాంకర్లు వడ్డీ చెల్లించడం, పింఛన్లను మంజూరు చేయడం వంటి ఆర్థిక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకున్నామని తెలిపింది. మారటోరియం కాలానికి ఈఎంఐల మీద చెల్లించాల్సిన వడ్డీల మీద వడ్డీ గానీ, నష్ట పరిహార వడ్డీని గానీ వసూలు చేయడం ఉండబోదని స్పష్టం చేసింది. పూర్తి వడ్డీని మాఫీ చేయడం అసాధ్యమని న్యాయమూర్తులు తీర్పు వెలువడించారు. బ్యాంకర్లు ఈఎంఐలపై వడ్డీ మీద వడ్డీని వసూలు చేసి ఉంటే.. దాన్ని సంబంధిత వ్యక్తులకు రీఫండ్ చేయాల్సి ఉంటుందని తీర్పు ఇచ్చింది. అలాగే- మారటోరియం కాలాన్ని పొడిగించాలంటూ కేంద్రాన్ని ఆదేశించలేమిన తెలిపింది.












Click it and Unblock the Notifications