మంత్రితో పర్సనల్గా డీల్ చేసుకోమని స్పీకర్ అన్నారు: మహిళా ఎమ్మెల్యే కంటతడి
చెన్నై: తమిళనాడు సభాపతి .ధన్పాల్ పైన ఓ మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి తన జిల్లాలో షార్ట్ సర్క్యూట్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చే పరిహారం అంశాన్ని సభలో ప్రశ్నించే ప్రయత్నం చేశారు. సభాపతి తిరస్కరించడంతో పాటు, మంత్రితో వ్యక్తిగతంగా డీల్ చేసుకోవాలని సూచించినట్లు ఆరోపించారు.

మంత్రితో వ్యక్తిగతంగా డీల్ చేసుకోమని చెప్పారు
సభాపతి సభాముఖంగానే మంత్రితో వ్యక్తిగతంగా బయట డీల్ చేసుకోవాలని చెప్పారని, ఈ విషయంలో సభను భాగస్వామ్యం చేయలేదని, స్పీకర్ అసెంబ్లీలో ఈ విధంగా ఎలా మాట్లాడుతారని, ఆ మాటలకు తనకు కన్నీళ్లు వచ్చాయని, జీరో అవర్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశమివ్వనని చెప్పారని మండిపడ్డారు.

భయపెట్టే రీతిలో మాట్లాడారని స్పీకర్
మహిళలకు అసెంబ్లీలోనే ఈ తరహా అనుభవం ఎదురైతే, ఇక రోడ్లపై వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని విజయధరణి అన్నారు. అయితే, స్పీకర్ ధన్పాల్ మాత్రం సదరు ఎమ్మెల్యే భయపెట్టే రీతిలో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. స్పీకర్ పైన వ్యాఖ్యల నేపథ్యంలో సదరు ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేశారు.

బహిష్కరణ వేటు, మార్షల్స్తో బలవంతంగా బయటకు
కన్యాకుమారి జిల్లాలో ప్రమాదం జరగడంతో, దానిపై తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో.. విజయధరణి పదేపదే మాట్లాడేందుకు ప్రయత్నించారు. సభలో మాట్లాడుతూ.. స్పీకర్కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని కూడా వ్యాఖ్యానించారని అంటున్నారు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు వేసి, మార్షల్స్తో బలవంతంగా బయటకు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీరు, మంత్రి కలిసి వ్యక్తిగతంగా డీల్ చేసుకోవాలని చెప్పారని కంటతడి పెట్టారు.

అంతకుముందు హెచ్చరికలు
అంతకుముందు, స్పీకర్ మాట్లాడుతూ.. విజయధరణి ఇలా వ్యవహరించడం మొదటిసారి కాదని, పద్ధతి మార్చుకోకుంటే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా అంశం గురించి ముందే నోటీసు ఇవ్వాలని, అప్పటికప్పుడు ఇవ్వడాన్ని తిరస్కరించారు. మరోవైపు, విజయధరణిపై వేటు వేసి, బయటకు పంపించిన తర్వాత అదే అంశంపై కాంగ్రెస్ నేత రామస్వామి లేవనెత్తే ప్రయత్నం చేయగా స్పీకర్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications