గుజరాత్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జిగ్నేష్ మేవాని: 'బీజేపీ నియంత్రుత్వంపై ప్రజా యుద్దం'
ఇదొక ప్రజాయుద్దం, ఎన్నికల్లో గెలిచేవరకు ఈ యుద్దాన్ని ఆపబోము' అని మేవాని ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నారు.
అహ్మదాబాద్: సామాజిక కార్యకర్త, దళిత నేత జిగ్నేష్ మేవాని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నారు. బనస్కంత జిల్లాలోని వదగమ్ నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు మేవాని ప్రకటించారు.
మేవానికి కాంగ్రెస్ పరోక్షంగా మద్దతు తెలపడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే మనిభాయ్ వాఘేలాను ఈసారి పోటీ చేయవద్దని కాంగ్రెస్ ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. దీనిపై పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)తో మాట్లాడిన వాఘేలా.. అది నిజమేనని తెలిపారు. మేవానితో ఒప్పందంలో భాగంగా తాను ఈ దఫా పోటీ చేయడం లేదని, పార్టీ కూడా అదే చెప్పిందని అన్నారు.

ఈ విషయాలన్ని సోమవారం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మేవాని వెల్లడించారు. 76మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసిన కొద్దిసేపటికి మేవాని ఈ ప్రకటన చేశారు. కాగా, మేవాని పోటీ చేయనున్న వదగమ్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం.
మేవానికి ఇస్తున్న మద్దతుకు సంబంధించి కాంగ్రెస్ మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటనేది చేయలేదు. ఇటీవల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినప్పటికీ.. మేవాని ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు.
'మనందరి ఉమ్మడి శత్రువు బీజేపీ. కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకునే అన్ని పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు నేనొక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీరెవరూ పోటీలో నిలవకండి.. తద్వారా బీజేపీతో నేరుగా తలపడే అవకాశం చిక్కుతుంది. నియంత్రుత్వ పోకడలపై ఇదొక ప్రజాయుద్దం, ఎన్నికల్లో గెలిచాక కూడా ఈ యుద్దాన్ని ఆపబోము' అని మేవాని ఫేస్ బుక్ ద్వారా పేర్కొన్నారు.
కాగా, వదగమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విజయ్ చక్రవర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే, పాటిదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్కు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications