ముఖ్యమంత్రి పేరు ఫైనల్: ప్రియాంక గాంధీ- ఖర్గే మార్క్ పాలిటిక్స్..!!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుమ్ము దులిపింది. గుజరాత్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన హస్తం పార్టీ హిమాచల్లో విజృంభించింది. భారతీయ జనత పార్టీని మట్టి కరిపించింది. క్లీన్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి చేస్తోంది. గుజరాత్పై ఎలాగూ ఆశలు వదిలేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు ఇచ్చిన తాజా తీర్పు కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపినట్టయింది.
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా ఇందులో భాగంగా ఈ మధ్యాహ్నం సిమ్లాలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశమైంది. తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ఉద్దేశించిన కీలక భేటీ ఇది. 68 అసెంబ్లీ స్థానాలు ఉన్న హిమాచల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం 35. ఈ మేజిక్ ఫిగర్ను అందుకుంది కాంగ్రెస్. కిందటి నెల 12వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు 40 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది.
ఈ ఓటమితో ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రమే తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామాతో అయిదు సంవత్సరాల బీజేపీ ప్రభుత్వానికి తెర పడినట్టయింది. ఇక కాంగ్రెస్ హయాం అక్కడ మొదలు కాబోతోంది.
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒకట్రెండు పేర్లు తెర మీదికి వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి ప్రతిభా సింగ్ పేరు మొదట్లో చక్కర్లు కొట్టింది. ముఖ్యమంత్రి రేసులో ఆమె ముందంజలో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. ప్రతిభా సింగ్.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ భార్య. మండీ లోక్సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఇప్పుడు ఆమెను ముఖ్యమంత్రిగా నామినేట్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
అదే సమయంలో వీరభద్రసింగ్- ప్రతిభాసింగ్ కుమారుడు విక్రమాదిత్య పేరు కూడా వినిపించింది. సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయాన్ని సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన రవి మెహతాను 13,860 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. సీఎం రేసులో విక్రమాదిత్య పేరు కూడా వినిపించింది.
ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకొన్నారు. తాజాగా సుఖ్వీందర్ సింగ్ సుఖు పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. సుఖ్వీందర్ పేరును ఈ సాయంత్రానికి అధికారికంగా ప్రకటించనుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నాదౌన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బీజేపీకి చెందిన విజయ్ అగ్నిహోత్రిని ఓడించారు. ఇప్పుడు తాజాగా ఆయన పేరును ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసింది. ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే ఈ మేరకు సుఖు పేరును ఖాయం చేసినట్లు చెబుతున్నారు.
తుఫాన్లో.. మోకాలి లోతు వరద నీటిలో - వైసీపీ ఎమ్మెల్యే భూమన