‘ఢిల్లీ వైపు సైన్యం నిజమే’: తివారీ, కాంగ్రెస్, బిజెపి ఫైర్
ఢిల్లీ: భారత సైన్యంలోని పోరాట దళాలు ఢిల్లీ దిశగా కదిలాయంటూ 2012లో కలకలం సృష్టించిన వార్తలకు మళ్లీ జీవం పోశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ. నాటి సైన్యాధిపతి జనరల్ వికె సింగ్ తిరుగుబాటుకు యత్నించారనే రీతిలో అప్పట్లో ఒక ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చిన వార్తలు ‘దురదృష్టకరమే కానీ నిజమైనవే' అని పేర్కొన్నారు.
కాగా, 2012 ఏప్రిల్ 4న ‘ఇండియన్ ఎక్స్ప్రెస్'పత్రికలో ఆ కథనం వెలువడింది. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా సైన్యంలోని రెండు కీలక విభాగాలు ఆ ఏడాది జనవరి 16 రాత్రి ఢిల్లీ వైపు కదిలాయన్నది ఆ కథనం సారాంశం. ఈ విషయాన్ని కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయని పేర్కొంది. హిసార్ నుంచి మెకనైజ్డ్ ఇన్ఫ్యాంట్రీ దళం, ఆగ్రా నుంచి 50వ పారా బ్రిగేడ్ దేశ రాజధాని వైపునకు కదిలాయని వివరించింది.
అదేరోజున తన పుట్టిన రోజు వివాదంపై జనరల్ వికె సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై నాటి యూపీఏ సర్కారుకు ఆయనకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. కాగా, తాజా శనివారం ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తివారీ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. ‘నాటి వార్త నిజమైనదే' అని చెప్పారు.
దీనిపై వాదనకు దిగాలన్నది తన ఉద్దేశం కాదని, తనకు తెలిసినంత వరకూ ఆ వార్త నిజమైందేనని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. కాగా, తివారీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వికె సింగ్ మండిపడ్డారు. ఇవన్నీ పనీపాటా లేని వ్యక్తి చేసిన ఆరోపణలన్నారు. ‘ప్రస్తుతం ఆయనకు పనేమీ లేదు. దీనిపై వివరణ ఇస్తూ నేను రాసిన ఒక పుస్తకాన్ని చదవాలని ఆయనకు చెప్పాలి' అని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, తివారీ వ్యాఖ్యలతో ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ కూడా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది. సైన్యం కదలిక వార్తలను అప్పట్లోనే ఖండించిన ఆ పార్టీ.. తాజాగా అదే వైఖరిని పునరుద్ఘాటించింది. ‘ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ తెలిపారు. బలగాల కదలిక సైనిక విధుల్లో భాగమేనని చెప్పారు.
ఈ వ్యాఖ్యల కోసం తివారీ ఎంచుకున్న సమయం రాజకీయంగా అనుమానాస్పదంగా ఉందని బిజెపి ఆరోపించింది. వీటిపై నాటి ప్రధాని మన్మోహన్సింగ్, రక్షణమంత్రి ఆంటోనీలు సమాధానం చెప్పాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థనాథ్ సింగ్ డిమాండ్చేశారు. తివారీతోపాటు అప్పట్లో పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా ఉన్న ప్రస్తుత కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా దీనిపై స్పందించారు.
సదరు అంశాన్ని సంఘంలో చర్చించినట్లు తనకు గుర్తులేదన్నారు. అయినా పార్లమెంటరీ సంఘాల్లో చర్చించిన అంశాలను బహిరంగపరచడం సరికాదని చెప్పారు. ఈ అంశంపై రాజకీయ ప్రత్యర్థులు చేసుకునే విమర్శలపై తాను వ్యాఖ్యానించబోనని నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రికకు ముఖ్య సంపాదకుడిగా వ్యవహరించిన శేఖర్ గుప్తా తాజాగా స్పష్టంచేశారు.
‘ఆ కథనానికి మరిన్ని ధృవీకరణలు అవసరంలేదు. ఒకవేళ ఎవరైనా ధ్రువీకరిస్తే స్వాగతిస్తాం' అని చెప్పారు. నాడు యూపీఏ ఆలోచనతీరు చాలా బలహీనంగా ఉందని చెప్పారు. ఆ ఘటన జరిగినట్లు అంగీకరిస్తే, దానికి సంబంధించి చర్య కూడా తీసుకోవాల్సి ఉంటుందన్న కోణంలో ఆలోచన సాగిందని తెలిపారు.