విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోండి: ఫేస్బుక్ను డిమాండ్ చేసిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ ద్వారా బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ ఆదివారం కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఘాటు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో ఫేస్బుక్ స్పష్టత ఇచ్చింది. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ఫేస్బుక్ వినియోగించుకునేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టెయిన్ చేయబోమని స్పష్టం చేసింది. అయితే ఇక్కడితో ఆ వ్యవహారం ముగియలేదు. తాజాగా ఫేస్బుక్ లో పనిచేసే భారత ఎగ్జిక్యూటివ్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఫేస్బుక్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది.
ఫేస్బుక్ సంస్థ విద్వేషపూరిత వ్యాఖ్యలపై పొందుపర్చిన నిబంధనలు భారత్లో కొందరి వ్యక్తులకు, కొన్ని గ్రూపులకు, వర్గాలకు మినహాయింపు ఇచ్చిందని ఓ వార్త సంస్థ వార్తను ప్రచురించిన నేపథ్యంలో కాంగ్రెస్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో పనిచేసే ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ డిమాండ్కు కమ్యూనిస్ట్ పార్టీ సీపీఎం మద్దతు తెలిపింది. భారత ఎగ్జిక్యూటివ్స్పై చర్యలు తీసుకునే వరకు ప్రభుత్వ శాఖల్లో లేదా రాజ్యాంగబద్దమైన సంస్థలు అంటే ఎలక్షన్ కమిషన్లలో ఫేస్బుక్ వినియోగంపై నిషేధం విధించాలని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి అన్నారు.
ప్రజాస్వామ్యంకు అంతరం కలిగించి వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టి సమాజంలో సామరస్యతను విచ్ఛిన్నం చేసే చర్యలు ఎట్టి పరిస్థితుల్లో సహించరాదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ అన్నారు. భారత్లో ఫేస్బుక్ కార్యకాలాపాలపై యాజమాన్యం ఓ కన్నేసి ఉంచాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన వ్యాఖ్యల పట్ల ఫేస్బుక్ జాగ్రత్తతతో వ్యవహరించాలని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్లు కోరాయి. మరొక వర్గాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలపై దృష్టి సారించి అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.