ఏపిలో కాంగ్రెస్కు ఒక్క సీటూ రాదు: వెంకయ్య జోస్యం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ రాదని, డిపాజిట్లు కూడా రావని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై చాలా ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. బిజెపి- తెలుగుదేశం పార్టీల కూటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
దేశంలో ఏ మూల వెళ్లినా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలి వీస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ప్రశంసించిందని చెప్పారు. నిరాశ, నిస్పృహలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనవసర ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. స్నూప్ గేట్ అనేది కాంగ్రెస్కు వీప్ గేట్ అని అన్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు ఈవిఎంల చుట్టూ తిరిగినా ఎన్నికల సంఘం చర్య తీసుకోలేదని వెంకయ్య నాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈవిఎంలను పరిశీలించారని, ఆయనపైనా ఈసి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పోలింగ్ సిబ్బంది చూస్తుండగానే కాంగ్రెస్ నాయకులు ఈవిఎం ఎన్క్లోజర్ వద్దకు వెళ్లారని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని చూపిస్తూ వెంకయ్యనాయుడు చెప్పారు.
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి బయటికి వచ్చి మాట్లాడిన నరేంద్ర మోడీ, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులపై ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారని, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అన్నారు.
ఎన్నికల సంఘం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల పక్షపాత దోరణి అవలంభిస్తోందని ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్లకు వారణాసిలో ర్యాలీ, ప్రచారం నిర్వహించుకునేందుకు అనుమతిచ్చిన ఎన్నికల సంఘం... నరేంద్ర మోడీ ర్యాలీకి అనుమతివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. మోడీ వారణాసి నుంచి లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఆయనకు ప్రచారం నిర్వహించుకునే హక్కుందని అన్నారు. మోడీ ర్యాలీని అడ్డుకుంటే.. ప్రజాస్వామ్యాన్ని అడ్డుకున్నట్లేనని అన్నారు. ఎన్నికల సంఘమే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications