ఒక్కరికేనా: రాహుల్, ఆందోళనతోనే రాహుల్: జైట్లీ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో టీచర్పై సామూహిక అత్యాచారంపై తక్షణమే చర్చించాలని పట్టుబడుతూ కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెల్లోకి దూసుకుపోవడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు. పార్లమెంటులో చర్చకు అనుమతించకుండా, ఒకరి గొంతు మాత్రమే వినిపించాలా అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశంలో ఒక్కరి గొంత మాత్రమే లెక్కలోకి వస్తుందనే పద్ధతిలో పార్లమెంటులో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
పార్లమెంటులో మాట్లాడడానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని, చర్చ జరగాలని తాము అడుగుతున్నామని, చర్చను అనుమతించకూడదనే మానసిక స్థితితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందరూ అలాగే భావిస్తున్నారని రాహు్ల గాంధీ పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో అన్నారు.
పార్టీలో అంతర్గతంగా ఓ వర్గం కాంగ్రెసు నాయకులు తిరుగుబాటును ఎదుర్కుంటున్నారని, అందుకే వారు ఆందోళన చెందుతున్నారని రక్షణ మంత్రి, బిజెపి నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. సమస్యను కానటువంటిదాన్ని సమస్యగా కాంగ్రెసు చిత్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు.
ఆరోపణలకు స్పందించను: సుమిత్రా మహాజన్
తనపై ఎవరైనా ఆరోపణలు చేస్తే తాను ప్రతిస్పందించబోనని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని నడిపించడానికి తాను ప్రాధాన్యం ఇస్తున్నానని, ఎవరైనా తనపై ఆరోపణలు చేస్తే తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
దేశంలో మతఉద్రిక్తతలు పెంచే సంఘటనలు పెరుగతుండడంపై కాంగ్రెసు అంతకు ముందు వాయిదా తీర్మానం ప్రతిపాదించింది. వాయిదా తీర్మానాన్ని అనుమతించి తక్షణ చర్చకు స్పీకర్ అనుమతించకపోవడంతో కాంగ్రెసు సభ్యులు న్యాయం కావాలి, ప్రధాని సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు.
ఇదంతా జరుగుతున్నప్పుడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలో ఉన్నారు. ఆమె తమ కాంగ్రెసు పార్టీ సభ్యుల నిరసనను ప్రోత్సహించడం కనిపించింది.