ఈబీసీ 10% కు ఓబీసీ 52%తో చెక్ పెట్టనున్న కాంగ్రెస్..!
ఢిల్లీ : 2019 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోందా? కేంద్రంలో కుర్చీ దక్కించుకోవడమే ధ్యేయంగా పావులు కదుపుతోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా మంట రాజేసిన రిజర్వేషన్ల రగడను ఆయుధంగా మలుచుకుంటోంది. అగ్రవర్ణాల పేదలకంటూ 10% రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చిన బీజేపీకి చెక్ పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతోంది.

ఆ రేంజ్ లోనే దెబ్బ..! కాంగ్రెస్ వ్యూహం
2019 జనరల్ ఎలక్షన్లను సీరియస్ గా తీసుకుంటోంది కాంగ్రెస్ అధిష్టానం. కేంద్రంలో పాగా వేయడమే లక్ష్యంగా దూసుకెళుతోంది. ప్రధాని మోడీతో పాటు బీజేపీ పాలనను టార్గెట్ చేస్తున్న హస్తం గూటి పెద్దలు.. అందుకనుగుణంగా స్కెచ్చులు వేస్తున్నారు. 10 శాతం రిజర్వేషన్లు తెరపైకి తెచ్చి అగ్రవర్ణాలకు బీజేపీ దగ్గరైందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆ రేంజ్ లోనే దెబ్బ కొట్టాలని వ్యూహాలు పన్నుతున్నట్లు సమాచారం. ఆ క్రమంలో దేశ జనాభాలో సగానికి సగమున్న బీసీలపై దృష్టి సారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

మేనిఫెస్టోలో కూడా బీసీ మంత్రం..!
2019 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పకడ్బందీ మేనిఫెస్టో రూపొందించేలా కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. అందులో ప్రధానంగా రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చేవిధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి వస్తే బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పిస్తామనే హామీతో ఎన్నికల బరిలోకి దిగాలనుకుంటోంది. దేశవ్యాప్తంగా అగ్రవర్ణాల జనాభా తక్కువున్న కారణంగా బీసీలకు దగ్గర కావాలనేది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. పార్టీలోని మేధావులు, రిజర్వేషన్లపై పట్టున్న నేతలు ఈ అంశాన్ని అధిష్టానానికి బలంగా వినిపిస్తున్నారట.

లెక్కలు కుదిరేనా..! కమలానికి దెబ్బ తగిలేనా?
అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడంతో బీజేపీ ప్రభుత్వంపై బీసీలు అసంతృప్తిగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా బీజేపీ లెక్క చేయలేదనేది వారి వాదన. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటూ ఆ సంఘాల నేతలు పోరాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందుకే బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇస్తామనే హామీతో
లోక్సభ ఎన్నికలకు సిద్ధం కానుంది.
బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశాల్లో ఇదివరకే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే వెనుకబడ్డ తరగతులందరికీ న్యాయం చేసినట్లవుతుందనే భావన కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. మొత్తానికి 10% దెబ్బతో కాంగ్రెస్ కుదేలవుతుందని బీజేపీ నేతలు భావిస్తే.. 52% ఎఫెక్ట్ తో కమలానికి చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు హస్తం గూటి నేతలు.












Click it and Unblock the Notifications