విద్యార్థులకు సెల్యూట్: సీఏఏపై సోనియా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ అనేది వివక్షా పూరితం, విభజించే చట్టమని వ్యాఖ్యానించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. దేశ ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు కేంద్రం సీఏఏను తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఏఏ అమలు వల్ల హాని జరుగుతుందని విద్యార్థులు గ్రహించారని, అందుకే వీధుల్లోకి వచ్చారని చెప్పారు. చలిని, పోలీసుల అణిచివేతను కూడా వారు లెక్క చేయలేదని అన్నారు. వారి ధైర్యానికి తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.
ప్రధాని, హోంమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని సోనియా ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి మరింత ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ లాంటి ప్రదేశాలు పోలీస్ స్టేట్స్గా మారిపోతున్నాయని ఆమె ఆరోపించారు. సీఏఏ నిరసనల్లో చోటుచేసుకున్న ఘటనలపై రాజ్యాంగ బద్ధమైన కమిటీ వేసి విచారించాలని డిమాండ్ చేశారు.
2020 ఎన్పీఆర్.. ఎన్ఆర్సీకి మారువేషమని సోనియా విమర్శించారు. ఎన్పీఆర్పై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఐకమత్యంగా వ్యవహరించి ఒక నిర్ణయం తీసుకోవాలని, దాన్నే అమలు చేయాలని ముఖ్యమంత్రులకు సోనియా సూచించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అన్నారు. జమ్మూకాశ్మీర్లో పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. జమ్మూకాశ్మీర్లో తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకురావాలన్నారు.
ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్రమంత్రులు చిదంబరం, ఆనంద్ శర్మ, ఏకే అంథోనీ, నేతలు కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిరాదిత్య సింథియా, పలురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశంలో ఎన్పీఆర్ ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ తీర్మానించింది.